హైదరాబాద్ టు బెంగళూరు.. ఇక కేవలం 2 గంటలే!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలను, హెల్త్ టూరిజాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు హైస్పీడ్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలను, హెల్త్ టూరిజాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు హైస్పీడ్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ భారీ ప్రాజెక్టులు తెలుగు రాష్ట్రాలకు 'గేమ్ ఛేంజర్'గా మారుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్రం రూ.5,454 కోట్లను కేటాయించిందని, ప్రయాణ సమయాన్ని ఊహించని విధంగా తగ్గించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
గంటకు 350 కి.మీ వేగం
హైదరాబాద్ కేంద్రంగా మూడు ప్రధాన నగరాలకు హైస్పీడ్ రైళ్లను అనుసంధానించనున్నట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. ఈ రైళ్లు గంటకు గరిష్టంగా 350 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తాయని, దీనివల్ల నగరాల మధ్య దూరం గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. హైదరాబాద్-బెంగళూరు ఐటీ కారిడార్ల మధ్య ప్రయాణం కేవలం రెండు గంటల్లోనే పూర్తవుతుంది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని కీలక నగరానికి కేవలం 1.55 గంటల్లో చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి తమిళనాడు రాజధాని చెన్నైకి కేవలం 2.55 గంటల్లో చేరుకునేలా ట్రాక్లను సిద్ధం చేస్తున్నారు. ఈ హైస్పీడ్ రైళ్ల రాకతో వ్యాపార వేగం పెరగడమే కాకుండా, అత్యవసర వైద్య సేవల కోసం ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లే రోగులకు ఇది గొప్ప వరంగా మారుతుందని పేర్కొన్నారు.



