ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక గ్రామసభలు
విశ్వంభర, మహబూబాబాద్: ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం దంతాలపల్లి మండల కేంద్రం, పెద్ద ముప్పారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణంలో నిర్వహించిన గ్రామసభకు ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసన సభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్, గూడూరు మండల కేంద్రంలో నిర్వహించిన సభకు మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్, ఇనుగుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభకు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర గీతం ఆలపించి గ్రామసభను ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి సందేశాన్ని ఎంపీడీవో వినిపించగా, గ్రామ పంచాయతీ పూర్తి సమగ్ర నివేదికను పంచాయతీ కార్యదర్శి, గ్రామస్థాయి అన్ని విభాగాల సిబ్బంది వారి వారి శాఖల ప్రగతి నివేదిక సభలో వివరించారు. ఈ సందర్భంగా వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారులు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు వెల్లడించారు. 18 మండలాలు, 5 మున్సిపాలిటీల ప్రత్యేక అధికారులు, 482 గ్రామపంచాయతీ కార్యాలయాలలో సర్పంచ్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ, సంబంధిత అన్ని విభాగాల సిబ్బందితో కలిసి ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు, అభివృద్ధి పథకాల వీడియో సందేశం ద్వారా, క్షేత్రస్థాయిలో సమగ్ర నివేదికలు చదివి వినిపించి గ్రామసభలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారులు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



