జీహెచ్ఎంసీ పునర్విభజనపై హైకోర్టు నోటీసులు

జీహెచ్ఎంసీ పునర్విభజనపై హైకోర్టు నోటీసులు

జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 55పై తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 55పై తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. ఈ జీవోను సవాలు చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. జనాభా గణన-2027 కోసం జ్యూరిస్డిక్షనల్ ఫ్రీజ్ అమల్లో ఉన్న సమయంలో ఈ పునర్విభజన చట్టవిరుద్ధమని పేర్కొంటూ దరం గురువ రెడ్డి అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేషన్ కుమార్ సింగ్ ధర్మాసనం విచారణకు స్వీకరించింది. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ రాజ్‌కుమార్ గుమ్మి, నిబంధనలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జనాభా లెక్కల కోసం జ్యూరిస్డిక్షన్ ఫ్రీజ్ ప్రకటించిన తర్వాత మున్సిపల్ సరిహద్దుల మార్పులు, స్థానిక సంస్థల పునర్వ్యవస్థీకరణకు చట్టపరమైన అనుమతి లేదని ఆయన వాదించారు. అధికార పరిధి లేకుండా జారీ చేసిన ఈ జీవోను ప్రారంభం నుంచే చెల్లనిదిగా ప్రకటించాలని కోరారు. పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు, ఈ విషయంపై కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయడానికి కోర్టు మూడు వారాల సమయం ఇచ్చింది. ఈ కౌంటర్లు దాఖలైన అనంతరం కేసును తదుపరి విచారణకు చేపట్టనున్నారు.

Read More తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ నూతన ప్రెసిడెంట్ గా గురజాల రాధా రాణి. -  పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపిన క్యాట్కో 

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం, జనాభా లెక్కల ప్రక్రియ ముగిసే వరకు అంటే 31 మార్చి 2027 వరకు జిల్లా, మండలం, గ్రామం లేదా మున్సిపల్ సరిహద్దులను మార్చడానికి వీల్లేదు. ఈ ఆంక్షలు అమల్లో ఉండగానే, ఫిబ్రవరి 11, 2026న తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ పునర్విభజన నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు రాజకీయంగా, చట్టపరంగా చర్చనీయాంశమైంది.