కంటోన్మెంట్లో ఎన్నికలు నిర్వహించాలి
- ఎంపీ ఈటల రాజేందర్
విశ్వంభర, హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్లో తక్షణ ఎన్నికలు నిర్వహించాలని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కంటోన్మెంట్ బోర్డు సభ్యులుగా బానుక నర్మదా మల్లికార్జున్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో తక్షణమే ఎన్నికలు నిర్వహించి, పాలక మండలి ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే ప్రజాప్రతినిధులు ఉండాలని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కంటోన్మెంట్లలో ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయని , కేవలం సికింద్రాబాద్ లో మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల్లో కంటోన్మెంట్ ప్రాంతాల అభివృద్ధి, పరిపాలనలో పారదర్శకత కోసం ఎన్నికలు జరగాలని డిమాండ్లు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఇటీవల రెండోసారి పదవీకాల విస్తరణ పొందిన భానుక నర్మదా మల్లికార్జున్ కి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల మధ్యలో ఉండి సమస్యలను పరిష్కరించేందుకు ఆమె చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పారు. అయితే నామినేటెడ్ సభ్యులతో కాకుండా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధుల ద్వారానే అన్ని వార్డుల ప్రజల సమస్యలు సమర్థవంతంగా పరిష్కారం అవుతాయని అన్నారు. కంటోన్మెంట్ అంటే కేవలం మిలటరీ ప్రాంతమనే భావన తప్పని , కంటోన్మెంట్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ఇతర పట్టణ ప్రాంతాల ప్రజలకు ఉన్న హక్కులు, సదుపాయాలు సమానంగా ఉండాలని చెప్పారు. రోడ్లు, మౌలిక సదుపాయాలు, పాత ఇండ్ల సమస్యలు వంటి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ప్రజాప్రతినిధుల సలహాలు లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ప్రజాస్వామ్యంలో అది ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. కంటోన్మెంట్లోని అన్ని డివిజన్లలో అన్ని వర్గాల ప్రజల సమస్యలపై సమగ్ర చర్చ జరగాలని అన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించేందుకు బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. అధికారులు ఈ రోజు ఉంటారు, రేపు వెళ్తారు కానీ మేము ఇక్కడే ఉంటామని అన్నారు. కంటోన్మెంట్ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించేందుకు మా వంతు కృషి చేస్తామని చెప్పారు.



