గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీలో కీలక మార్పులు

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీలో కీలక మార్పులు

 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 జ్యూరీ కమిటీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 జ్యూరీ కమిటీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు స్పెషల్ జ్యూరీ చైర్మన్‌గా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజను నియమిస్తూ తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ బాధ్యతలు నిర్వహించిన సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజ నియమితులయ్యారు.

మార్చి 19న ఉగాది కానుకగా పురస్కారాల ప్రదానం
ఈ ఏడాదికి గాను ఎంపిక చేసిన చిత్రాలకు ఉగాది పండుగ సందర్భంగా మార్చి 19న అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ పురస్కారాల కోసం ఎంపికైన చిత్రాల స్క్రీనింగ్ ప్రక్రియ ఇప్పటికే ఈనెల 6 నుండి ప్రారంభమైంది. జ్యూరీ కమిటీ సభ్యులు చురుకుగా చిత్రాలను పరిశీలిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను భారతీయ సినీ రంగానికి కేంద్రంగా చేయాలన్న ఉన్నతమైన ఆలోచనతో ప్రభుత్వం ఉందని ఆయన వెల్లడించారు.

Read More శ్రీ లక్ష్మీ గోశాలకు  5116 విరాళం

సినిమాలకు గద్దర్ పురస్కారాల్లో ప్రాధాన్యత
సమాజం కోసం కళల ద్వారా తన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు గద్దర్ అని ముఖ్యమంత్రి కొనియాడారు. గద్దర్ సినిమా అవార్డుల ఎంపిక ప్రతిభ, పారదర్శకత ప్రమాణంగా జరుగుతుందని ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఎంపిక చేసే సినిమాల్లో వాణిజ్య అంశాలతో పాటు సామాజిక సందేశం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటే మంచి సినిమాలను మరింత ప్రోత్సహించేందుకు అవకాశం కలుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గతేడాది లాగే ఈసారి కూడా అవార్డుల ప్రదానోత్సవాన్ని భారీ స్థాయిలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.