సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్లతో మోసం
సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్లతో జరిగే మోసాలపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్ వేదికగా కీలక వివరాలు వెల్లడించారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్లతో జరిగే మోసాలపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్ వేదికగా కీలక వివరాలు వెల్లడించారు. ఏ చిన్న సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్ లేదా ఇతర సెర్చ్ ఇంజిన్లలో వెతకడం మనకు అలవాటు.. అయితే, ఈ అలవాటే సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోందని తెలిపారు. సెర్చ్ ఇంజిన్లలో టాప్లో కనిపించే వెబ్సైట్లు లేదా 'స్పాన్సర్డ్' అని ఉన్న లింకులు అన్నీ సురక్షితమైనవి కావని గుర్తించాలన్నారు. కేవలం సెర్చ్ ఫలితాల్లో పైన కనిపించినంత మాత్రాన అది అసలైన వెబ్సైట్ అని గుడ్డిగా నమ్మితే నిలువునా మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఫిషింగ్ వెబ్సైట్లతో మోసం
సైబర్ ముఠాలు ఇప్పుడు అధునాతన 'సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్' పద్ధతులను, పెయిడ్ యాడ్స్ను ఆసరాగా చేసుకుంటున్నాయని సజ్జనార్ తెలిపారు. ప్రభుత్వ పోర్టల్స్, బ్యాంకులు, ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల పేర్లతో అచ్చం అసలైన వాటిని పోలి ఉండే 'ఫిషింగ్' వెబ్సైట్లను సృష్టిస్తున్నాయని తెలిపారు. వీటిని సెర్చ్ రిజల్ట్స్లో అగ్రస్థానంలో ఉండేలా జాగ్రత్త పడుతున్నాయని, వినియోగదారులు కస్టమర్ కేర్ నంబర్ల కోసం లేదా పేమెంట్ సర్వీసుల కోసం వెతికినప్పుడు, ఈ నకిలీ లింకులు పైన కనిపిస్తాయని తెలిపారు. అవి నిజమేనని నమ్మి క్లిక్ చేయగానే మోసం మొదలవుతుందని సూచించారు.
ఆర్థిక నష్టంతో పాటు ఐడెంటిటీ థెఫ్ట్ ప్రమాదం
ఈ నకిలీ వెబ్సైట్లలోకి వెళ్లిన వెంటనే మీ వ్యక్తిగత వివరాలు, లాగిన్ పాస్వర్డ్లు లేదా బ్యాంకింగ్ వివరాలను నమోదు చేయమని అడుగుతారని అన్నారు. ఒకసారి మీరు ఆ సమాచారాన్ని ఇస్తే, క్షణాల్లో మీ ఖాతా ఖాళీ అయిపోతుందని తెలిపారు. కేవలం ఆర్థిక నష్టమే కాకుండా, మీ పేరిట ఉన్న డాక్యుమెంట్లను దొంగిలించి 'ఐడెంటిటీ థెఫ్ట్'కు పాల్పడే అవకాశం కూడా ఉందని సీపీ హెచ్చరించారు.
రక్షణ మార్గాలు
వెబ్సైట్ అడ్రస్ను క్షుణ్ణంగా పరిశీలించండి. స్పెల్లింగ్ చిన్న తేడా ఉన్నా అది నకిలీదని గుర్తించాలి. సెర్చ్ ఇంజిన్లలో వెతకడం కంటే, అధికారిక వెబ్సైట్ చిరునామా తెలిస్తే నేరుగా అడ్రస్ బార్లో టైప్ చేయడం సురక్షితం.సెర్చ్ రిజల్ట్స్లో 'Sponsored' లేదా 'Ad' అని ఉంటే వాటిని క్లిక్ చేసేటప్పుడు రెట్టింపు అప్రమత్తత అవసరం. ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైనట్లు అనుమానం వస్తే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930 కి కాల్ చేయండి లేదా ఆన్లైన్లో ఫిర్యాదు చేయండి.



