‘ఆపరేషన్‌ ఆక్టోపస్‌’.. 104 మంది అరెస్ట్

 ‘ఆపరేషన్‌ ఆక్టోపస్‌’..  104 మంది అరెస్ట్

 హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ‘ఆపరేషన్‌ ఆక్టోపస్‌’ పేరుతో దేశవ్యాప్తంగా అతిపెద్ద ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. మొత్తం 16 రాష్ట్రాల్లో విస్తరించిన ఈ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు పోలీసులు 32 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ‘ఆపరేషన్‌ ఆక్టోపస్‌’ పేరుతో దేశవ్యాప్తంగా అతిపెద్ద ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. మొత్తం 16 రాష్ట్రాల్లో విస్తరించిన ఈ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు పోలీసులు 32 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. గత 10 రోజుల పాటు నిరంతరాయంగా సాగిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 104 మంది సైబర్‌ నేరగాళ్లను కటకటాల వెనక్కి నెట్టారు. నిందితుల్లో సామాన్యులే కాకుండా, నేరగాళ్లకు సహకరించిన పలువురు బ్యాంకు అధికారులు కూడా ఉండటం గమనార్హం. నిందితులపై దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మొత్తం 1,055 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు వీరు పలు రకాల సైబర్‌ నేరాలకు పాల్పడి అమాయకుల నుంచి రూ.127 కోట్లకు పైగా దోచుకున్నట్లు దర్యాప్తులో తేలింది. వీరి అరెస్టుతో దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్న కేసులకు పరిష్కారం దొరికే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

భారీగా పట్టుబడిన మారణాయుధాలు, పరికరాలు
నిందితుల స్థావరాలపై దాడులు చేసిన సమయంలో పోలీసులు భారీ ఎత్తున నేరపూరిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి రూ.36 లక్షల నగదుతో పాటు, నేరాలకు ఉపయోగించే 204 మొబైల్‌ ఫోన్లు, 141 సిమ్‌ కార్డులను సీజ్ చేశారు. వీటితో పాటు 152 బ్యాంక్‌ పాస్‌బుక్‌లు, 234 డెబిట్‌ కార్డులు, 26 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాల వివరాలను నేరగాళ్లకు చేరవేయడంలో బ్యాంకు ఉద్యోగుల పాత్రపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.

Read More కవిత కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..

అత్యాధునిక నెట్‌వర్క్‌ ధ్వంసం
ఈ ఆపరేషన్‌ ద్వారా దేశంలోని ప్రధాన సైబర్‌ నేరగాళ్ల ముఠాకు గట్టి దెబ్బ తగిలింది. పక్కా సమాచారంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి హైదరాబాద్ పోలీసులు ఈ భారీ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేశారు. సైబర్‌ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు లేదా ఫోన్ కాల్స్ వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.