కామారెడ్డి ఎమ్మెల్యేకు ప్రాణహాని
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు
విశ్వంభర, నిజామాబాద్: కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డికి ప్రాణహాని ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అన్నారు. ఆదివారం సాయంత్రం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శనివారం ఓ కాంగ్రెస్ నాయకుడు కారుతో వచ్చి క్యాంప్ కార్యాలయంపై దాడికి యత్నించాడని అన్నారు. జిల్లా ఎస్పీ సూచనతో ఎమ్మెల్యే ఇంట్లోనే ఉంటే కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారం మాట్లాడారని తెలిపారు. తమ ఎమ్మెల్యేపై ఈగ వాలినా ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులకు నీతి, నిజాయితీ ఉంటే సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ వద్దకు డాక్యుమెంట్లతో వచ్చి ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ చేశారు. తప్పు ఉంటే కలెక్టర్ ఎదుటే స్పీకర్కు ఫోన్ చేసి రాజీనామా ఇస్తానని ఎమ్మెల్యే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చి సమస్య పరిష్కరించాలని, ఇక్కడితో ఈ అంశాన్ని ముగించాలని సూచించారు. తమ ఎమ్మెల్యేకు ప్రాణహాని ఉందని, ఆయనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.



