బొగ్గుల శ్రీనివాస్ ది  హత్యే 

బొగ్గుల శ్రీనివాస్ ది  హత్యే 

  • కేసును ఛేదించిన పోలీసులు 
  • ఆర్థిక లావాదేవీలే అసలు కారణం 
  • సుపారీ ముఠా పనే 
  • పోలీసుల అదుపులో నిందితులు  
  • పవన్ కళ్యాణ్ పై రాసిన  పుస్తకంతో సంబంధం లేదు 
  • విలేకరుల సమావేశంలో  ఏసీపీ వెల్లడి 

 

విశ్వంభర, ఖమ్మం: రచయిత, యూ ట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ హత్య కేసును ఖమ్మం జిల్లా పోలీసులు ఛేదించారు. శ్రీనివాస్ హత్యకు దారి తీసిన పరిస్థితులను, పరిణామాలను ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఆర్థిక లావాదేవీల వివాదమే శ్రీనివాస్ దారుణ హత్యకు దారి తీసినట్లు చెప్పారు. అశ్వరావుపేటకు చెందిన సుపారీ ముఠా శ్రీనివాస్ ను కత్తులతో పొడిచి, ఇనుపరాడ్లతో కొట్టి చంపినట్లు ఏసీపీ తెలిపారు. ఈ హత్యోదంతానికి, పవన్ కళ్యాణ్ పై శ్రీనివాస్ రాసిన పుస్తకానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఏసీపీ తిరుపతిరెడ్డి కథనం ప్రకారం, బొగ్గుల శ్రీనివాస్ హైదరాబాద్ లో నివసిస్తూ యూ ట్యూబర్ గా, రచయితగా ప్రాచుర్యం పొందాడు. యూ ట్యూబ్, ఇన్ స్టా గ్రామ్ లలో వీడియోలు చేస్తుండేవాడు. శ్రీనివాస్ తో పాటు మేకల వేణుమాధవ్ రెడ్డి అనే వ్యక్తి సిల్వర్ జూబ్లీ కాలేజీలో చదువుకున్నారు. కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరైన సందర్భంలో ఒకరికొకరు పరిచయం అయ్యారు. బొగ్గుల శ్రీనివాస్ కు బొగ్గుల బిబిక్యూ  (BOGGULA BBQ) పేరుతో జిఎస్టీ  లైసెన్స్ ఉండగా, వేణుమాధవ్ రెడ్డి ‘మేకా ప్రాజెక్ట్స్’ పేరుతో ఓ కంపెనీని స్థాపించి సబ్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్ కు చెందిన బొగ్గుల బిబిక్యూ  పేరుపై నకిలీ ఇన్ వాయిస్, సేల్స్ ఫైల్ చేసి మంచి లాభాలు సంపాదించవచ్చని వేణుమాధవ్ రెడ్డి అతనికి చెప్పాడు. ఇందుకు శ్రీనివాస్ అంగీకరించాడు. అయితే తన జీఎస్టీ లైసెన్స్ ఉపయోగించుకున్నందుకు యాభై శాతం లాభాలు తనకు ఇవ్వాలని షరతు విధించగా, అందుకు వేణుమాధవ్ రెడ్డి ఒప్పుకున్నాడు. ఈ తరహాలో నకిలీ ఇన్ వాయిస్, సేల్స్ ద్వారా బొగ్గుల బిబిక్యూ ,  జీఎస్టీ లైెసెన్సుపై 2022-25 సంవత్సరాల మధ్య రూ. 90 లక్షలు సంపాదించారు. ఈ మొత్తంలో శ్రీనివాస్ వాటా రూ. 45 లక్షలు కాగా, వేణుమాధవ్ రెడ్డి రూ. 15 లక్షలు మాత్రమే  ఇచ్చాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రూ. 30 లక్షలు తర్వాత ఇస్తానని వేణుమాధవ్ రెడ్డి శ్రీనివాస్ తో చెప్పాడు. అయితే జీఎస్టీ దుర్వినియోగానికి సంబంధించి అటు వేణుమాధవ్ రెడ్డికి, ఇటు శ్రీనివాస్ కు నోటీసులు అందాయి. అంతేగాక బొగ్గుల బిబిక్యూ  కంపెనీ జీఎస్టీ లైసెన్స్ కూడా రద్దయింది. దీంతో తనకు చెల్లించాల్సిన రూ. 30 లక్షల మొత్తాన్ని ఇవ్వడంతోపాటు తన కంపెనీ జీఎస్టీ లైసెన్సును తిరిగి తెరిపించాలని వేణుమాధవ్ రెడ్డిని  శ్రీనివాస్ కోరాడు. అయితే ఇందుకు రూ. కోటి పైనే జీఎస్టీ జరిమానా చెల్లించాల్సిన పరిస్థితుల కారణంగా శ్రీనివాస్, వేణుమాధవ్ రెడ్డిల మధ్య తీవ్ర విభేదాలు, వివాదాలు తలెత్తాయి. ఆర్థిక ఒత్తిడికి బొగ్గుల బిబిక్యూ  కంపెనీ జీఎస్టీ లైసెన్స్ తిరిగి యాక్టివేట్ చేయించడం, కోటి రూపాయల జరిమానా భారం తదితర అంశాలు తోడవడంతో వేణుమాధవ్ రెడ్డి మదిలో హత్య యోచన మెదిలింది. ఈమేరకు కుట్ర పన్నిన వేణుమాధవ్ రెడ్డి అశ్వారావుపేటకు చెందిన పోకల కోటేశ్వర్ రావు, షేక్ అబ్దుల్ హఫీజ్, మహ్మద్ అజ్మత్ ఆలీ ఖాన్ తో కలిసి శ్రీనివాస్ హత్యకు కుట్ర పన్నాడు. 
కుట్ర అమలులో భాగంగా పోకల వెంకటేశ్వర్ రావు, అబ్దుల్ హపీజ్, ఆజ్మత్ ఆలీఖాన్ ముఠాకు రూ. 5 లక్షల మొత్తాన్ని వేణుమాధవ్ రెడ్డి సుపారీగా చెల్లించాడు. చెల్లించాల్సిన డబ్బును ఇస్తామంటూ ఈనెల 13వ తేదీన రాత్రి శ్రీనివాస్ ను  వేణుమాధవ్ రెడ్డి నమ్మించాడు. డబ్బుకోసం విజయవాడకు వెళదామని చెప్పి శ్రీనివాస్ ను కారులో తీసుకువెళ్లారు. ఆ మరుసటి రోజు 14వ తేదీన తెల్లవారుజామున నకిరేకల్ నుంచి జనగామ వైపునకు వెళ్లే దారిలో నిర్మానుష్య ప్రదేశంలో నిందితులు కత్తులు, ఐరన్ రాడ్లతో శ్రీనివాస్ తలపై కొట్టి, పొడిచి దారుణంగా హత్య చేశారు. శ్రీనివాస్ ను ఈ విధంగా హత్య చేసిన తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు పథకరచన చేశారు. ఇందులో భాగంగానే మృతదేహాన్ని కారులో తీసుకుని పాలేరు రిజర్వాయర్ లో పడేసి, కారు ప్రమాద ఘటనగా నమ్మించే యత్నం చేశారు. అయితే మొత్తం ఘటనలో ట్విస్ట్ ఏమిటంటే, కారును రిజర్వాయర్ లోకి తోసేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన సుపారీ ముఠా మాత్రం పోలీసుల దర్యాప్తు నుంచి తప్పించుకోలేకపోవడం. కారును రిజర్వాయర్ లోకి పడేసిన తర్వాత దాన్ని నడిపిన వ్యక్తి పారిపోవడమే పోలీసులకు ఘటనపై అసలు అనుమానాన్ని రేకెత్తించింది. అంతేగాక శ్రీనివాస్ కారు వెనుక సీట్లో కూర్చొని ఉండడం, అతని శరీరంపై గాయాలు ఉండడం కూడా పోలీసులకు మరిన్ని సందేహాలను కలిగించింది. దీంతో పోలీసులు అత్యంత చాకచక్యంగా, సాంకేతిక ఆధారాలు, ఇతర సాక్ష్యాల సేకరణ ద్వారా శ్రీనివాస్ ది సుపారీ హత్యగా దర్యాప్తులో తేల్చారు. ఈమేరకు ప్రధాన నిందితుడు వేణుమాధవ్ రెడ్డిని, సుపారీ ముఠాకు చెందిన పోకల వెంకటేశ్వర్ రావు, అబ్దుల్ హపీజ్, ఆజ్మత్ ఆలీఖాన్ లను అరెస్ట్ చేశారు. ఇటువంటి నేరాలకు పాల్పడేవారు ఎంత తెలివిగా వ్యవహరించినప్పటికీ, ఏదో ఒక ఆధారాన్ని పోలీసుల దర్యాప్తుకోసం వదులుతారనే విషయం బొగ్గుల శ్రీనివాస్ హత్యోదంతం ద్వారా మరోసారి రుజువైందని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. నేరాలకు పాల్పడేవారు పోలీసుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరనే విషయాన్ని గుర్తించాలని ఆయన అన్నారు. శ్రీనివాస్ హత్యకు దారి తీసిన పరిస్థితులకు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అతను పుస్తకం రాయడానికి ఎటువంటి సంబంధం లేదని ఏసీపీ స్పష్టం చేశారు.
కాగా ఈ కేసును విజయవంతంగా దర్యాప్తు జరిపి ఛేదించిన కూసుమంచి సీఐ సంజీవ్, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం ఎస్ఐలు నాగరాజు, సంతోష్, జగదీష్, ప్రొబేషనరీ ఎస్ఐ దివ్యలను ఏసీపీ తిరుపతిరెడ్డి అభినందించారు. అదేవిధంగా ఈ కేసులో సహకరించిన శ్రీకాంత్, సతీష్, వినయ్, ఉదయ్, పూర్ణచందర్ రావు, శ్రీశైలం, శ్రీలత, సయ్యద్, శోభన్, సీతారాములు, హోంగార్డు రాంబాబును ఏసీపీ ప్రశంసించారు. నాలుగు టీంలుగా దర్యాప్తును విజయవంతంగా పూర్తిచేసి, నిందితులను అరెస్ట్ చేసిన ఆయా అధికారులకు, సిబ్బందికి రివార్డులను కూడా ఏసీపీ అందించారు.

Tags: