మెడికల్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య

విశ్వంభర,సిద్దిపేట: అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలోని సురభి మెడికల్ కాలేజీలో ఫిజియోథెరపీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శ్రీజ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపెల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం మెడిపెల్లి గ్రామానికి చెందిన శ్రీజ సురభి మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది.  హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని మృతిచెందింది. తోటి విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  ఆమెకు తల్లిదండ్రులు లేరని, మేనమామే సురభి మెడికల్ కాలేజీలో చేర్పించినట్టు తెలిసింది.  ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలా.. చదువు ఒత్తిడా..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.  ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యానిదే పూర్తి బాధ్యతని కుటుంబ సభ్యులు విలపించారు. ప్రభుత్వ ఆస్పత్రిలోని శ్రీజ మృత దేహాన్ని  సామాజిక కార్యకర్త చక్రధర్ గౌడ్ పరిశీలించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు. నిజాలు బయటకు రాకుండా పోలీసులు కాలేజీ యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.   జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి కాలేజీ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags: