గత హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆర్థిక వ్యవహారాల్లో భారీ అక్రమాలు.- ఒక కన్వెన్షన్ సెంటర్కు రూ. 32 లక్షలు చెల్లింపులు. - నిధుల దుర్వినియోగంపై మూడు సార్లు నోటీసులు ఇచ్చినా గత బాధ్యులు స్పందించలేదు: హెచ్బీఎఫ్ అధ్యక్షుడు కవి యాకూబ్, కార్యదర్శి వాసు.
విశ్వంభర, హైదరాబాద్ :-ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ బుక్ ఫెయిర్ (హెచ్బీఎఫ్) ఆర్థిక వ్యవహారాల్లో భారీ అక్రమాలు జరిగాయి అని , ఒక కన్వెన్షన్ సెంటర్కు రూ. 32 లక్షలు చెల్లించడం వెనక అంతర్యం ఏమిటని హెచ్బీఎఫ్ అధ్యక్షుడు కవి యాకూబ్, కార్యదర్శి వాసు లు ప్రశ్నించారు. గత కార్యవర్గం హయాంలో బ్యాంకు ఖాతాల నిర్వహణ, నిధుల మళ్లింపుపై ఆదివారము నూతన కార్యవర్గం మీడియా సమావేశాన్ని నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 నుంచి 2022 వరకు కొనసాగిన గత కార్యవర్గం హయాంలో బ్యాంకు ఖాతాల నిర్వహణ, నిధుల మళ్లింపులు జరిగాయని అన్నారు.
1986 నుంచి కాచీగూడలోని బీఓఐలో అధికారిక ఖాతా ఉండగా, రిజిస్ట్రేషన్ లేకుండానే 2021లో ఐసీఐసీఐ బ్యాంకులో, 2016లో ఎస్బీఐలో కొత్త ఖాతాలు ఎందుకు తెరవాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
2017 మార్చి నెలలో కేవలం 15 రోజుల్లోనే రూ. 2.30 లక్షల నగదును ఎందుకు ఉపసంహరించారు అని అన్నారు. 2018లో ఒక కన్వెన్షన్ సెంటర్కు రూ. 11.50 లక్షలు చెల్లించడం వెనక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
గతంలో నిర్వహించిన 8 ప్రదర్శనలకు సంబంధించి ఫుడ్ స్టాల్స్, టికెట్ల విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం బ్యాంకు ఖాతాల్లో ఎందుకు జమ కాలేదు? అని నిలదీశారు.సంస్థకు అధికారిక బ్యాంక్ ఖాతా ఉండగా ‘ది హైదరాబాద్ బుక్ ఫెయిర్’ పేరిట రిజిస్ట్రేషన్ లేని మరో అకౌంట్ను తెరిచి నిధులు దారిమళ్లించారని పేర్కొన్నారు. ఎస్బీఐ ఖాతా నుంచి ఒక కన్వెన్షన్ సెంటర్కు రూ. 32 లక్షలు బదలాయించారని, రూ. 10 లక్షల నగదు విత్ డ్రా చేశారని ఆధారాలతో సహా వెల్లడించారు. జిల్లాల్లో జరిగిన ప్రదర్శనలకు ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయం, టికెట్లు, ఫుడ్ కోర్టుల ద్వారా వచ్చిన ఆదాయం ఎక్కడా బ్యాంకులో జమ కాలేదని ఆరోపించారు.నిధుల దుర్వినియోగంపై మూడు సార్లు నోటీసులు ఇచ్చినా గత బాధ్యులు స్పందించలేదని కమిటీ తెలిపింది. దీంతో వారి సభ్యత్వాలను తాత్కాలికంగా రద్దు చేసి, ‘బ్లాక్ లిస్ట్’లో ఉంచినట్లు ప్రకటించారు. పదేళ్లుగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదని, అసలు క్యాష్ బుక్, వోచర్లు కూడా అప్పగించలేదని మండిపడ్డారు. జిల్లాల్లో ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సహాయం బ్యాంకు రికార్డుల్లో కనిపించడం లేదని, కొత్త కార్యదర్శి ఎన్నికైనా పాతవారే సిగ్నేటరీలుగా కొనసాగడం తీవ్రమైన ఆర్థిక నేరం కిందకే వస్తుందని వారు పేర్కొన్నారు. నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ నుంచి తప్పుకున్నాక కూడా కోయ చంద్రమోహన్ కార్యదర్శిగా కొనసాగడం నియమావళికి విరుద్ధమని స్పష్టం చేశారు. బుక్ ఫెయిర్ కార్యాలయాన్ని సొంత అవసరాలకు వాడుకోవడంపై మండిపడ్డారు.ఈ అక్రమాలపై వివరణ ఇవ్వాలని గత కమిటీ బాధ్యులైన జూలూరి గౌరీశంకర్, కోయ చంద్రమోహన్, పి. రాజేశ్వరరావులకు మూడుసార్లు లేఖలు రాసినా స్పందన లేదని కమిటీ తెలిపింది. ఈ నేపథ్యంలో వారి సభ్యత్వాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు, రాబోయే బుక్ ఫెయిర్లలో వారు పాల్గొనకుండా జనరల్ బాడీ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వివరణ ఇవ్వాల్సింది పోయి.. సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుత కమిటీపై బురద చల్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్బీఎఫ్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బాల్ రెడ్డి పాల్గొన్నారు.



