వసతి గృహాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి 

వసతి గృహాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి 

  • మరమ్మతుల బిల్లులు ప్రతి 15 రోజులకు క్లియర్ చేస్తాం 
  • వారసత్వంగా ఉన్న ఆలయాలను అభివృద్ధి చేయండి  
  • ప్రీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ  సీఎం భట్టి విక్రమార్క మల్లు

విశ్వంభర,  హైదరాబాద్ : సంక్షేమ వసతి గృహాల కోసం నిర్మిస్తున్న భవనాల్లో 80 శాతం పూర్తయిన వాటిని యుద్ద ప్రతిపదికన రాబోయే మూడు నెలల్లో పూర్తిచేసి రానున్న విద్యా సంవత్సరంలో అందుబాటులోకి తీసుకురావాలని సంక్షేమ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ  సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి ఆయా సంక్షేమ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలను సమీక్షించారు. తదుపరి వైద్య, ఆరోగ్యశాఖ, దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వసతి గృహాల మరమ్మతుల బిల్లులు ప్రతి 15 రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా ఆర్థిక శాఖకు వచ్చే విధంగా ఒక సీనియర్ అధికారిని నియమించి బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ఈ వేసవిలో వసతి గృహాల మరమ్మత్తు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారుల నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని తెలిపారు. సంక్షేమ వసతి గృహాల  అద్దెలు, ఎలక్ట్రికల్ బిల్లులు, కాస్మోటిక్ చార్జీలు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలు ప్రతినెలా చెల్లిస్తామని సంక్షేమ శాఖ అధికారులు సకాలంలో ఆర్థిక శాఖకు బిల్లులు పంపాలని డిప్యూటీ సీఎం సూచించారు. గత ప్రభుత్వ కాలంలో ఈ బిల్లులు ఏడు నెలలకు ఒకసారి చెల్లించేవారని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. వసతి గృహాలకు సరఫరా చేస్తున్న మెటీరియల్ క్వాలిటీ చెక్ కోసం ఒక నిర్దిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకొని నిరంతరం సమీక్షించాలని డిప్యూటీ సీఎం సూచించారు. డైట్ చార్జీలు 40 శాతం పెంచాం, కాస్మోటిక్ చార్జీలు 200 శాతం పెంచాం, సంక్షేమ వసతి గృహాలకు సంబంధించిన బిల్లులను మొదటి ప్రాధాన్యతగా గుర్తించి చెల్లిస్తున్నాం ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు నిత్యం వసతి గృహాలను సందర్శించి స్థానికంగా జరుగుతున్న బోధన, భోజనంలో నాణ్యత, సంక్షేమ వసతి గృహాల్లో సదుపాయాలను పరిశీలించి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.
ప్రపంచం మొత్తం ఆయుర్వేదం వైపు చూస్తున్న నేపథ్యంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా మెడిసినల్ ప్లాంట్లు పెంచేందుకు  ఆయుష్ శాఖ ఏర్పాట్లు చేసుకోవాలని అందుకు సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ సమావేశంలో డిప్యూటీ సీఎం సూచించారు. ఉపాధి హామీ పథకం లో భాగంగా గ్రామాల్లో పెద్ద సంఖ్యలో మెడిసినల్ ప్లాంట్లు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే స్థానిక ప్రజలు అడవిని కాపాడుకుంటారని అటవీశాఖ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. పర్యాటక రంగం విస్తరిస్తే స్థానిక ప్రజలకు ఉపాధితో పాటు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. కాలుష్య కారకాలు వాటిని నియంత్రించకపోతే వచ్చే ప్రమాదాలు అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. తరతరాలుగా వారసత్వంగా వస్తున్న దేవాలయాల అభివృద్ధిపై దృష్టి సారించాలని దేవాదాయ శాఖ సమావేశం లో  డిప్యూటీ సీఎం సూచించారు. సమావేశాల్లో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నతాధికారులు సభ్య సాచి గోష్, కృష్ణ ఆదిత్య, క్రిస్టినా, సువర్ణ, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

Tags: