ఇందూరు లో ఘనంగా బ్రహ్మోత్సవాలు 

ఇందూరు లో ఘనంగా బ్రహ్మోత్సవాలు 

విశ్వంభర, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని నర్సింగ్ పల్లి ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు ఉదయం నిత్య హవన పూర్ణాహుతి తర్వాత సామూహిక భగవద్గీత పఠణ కార్యక్రమం నిర్వహించారు. తదుపరి షాక్తా పరిషత్ బృందం గురువు శ్రీ పవన్ శర్మ  మహిళా శిష్య బృందం చే విష్ణు సహస్రనామ పారాయణం, లలిత సహస్రనామ పారాయణం, సౌందర్యలహరి సామూహిక గానం ఏర్పాటు చేశారు.  భక్తులు భక్తి పరవశ్యంలో మునిగిపోయారు. భక్తులు నిజామాబాద్ నగరం, నర్సింగ్ పల్లి చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మారుమ్రోగాయి. సాయంత్రం అశ్వవాహనంపై మాడ వీధుల్లో ఊరేగిన శ్రీనివాసుడు అశ్వ వాహనం పై వచ్చిన శ్రీవారు సిరి సంపదలను తీసుకొని వస్తాడని శ్రీశ్రీశ్రీ దేవనాథ జీయర్ స్వామి వారు తెలిపారు. సాయంత్రం పూర్ణాహుతి తరువాత శ్రీవారిని అశ్వవాహనంపై మాడ వీధుల్లో ఊరేగించి దోపోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. "ఆళ్వారుల్లో చివరి ఆళ్వారు అయిన తిరుమంగై ఆళ్వారు జీవిత చరిత్రను దోపోత్సవంగా ప్రదర్శించారు". తిరుమంగై ఆళ్వారుగా మారిన పరకాలుని కథ రూపకమే దోపోత్సవం. గ్రామానికి చెందిన ఆడబిడ్డలు మంగళ హారతులతో స్వామి వారిని ఆహ్వానించారు. గ్రామ యువత ఆట పాటలతో అశ్వవాహన ఊరేగింపులో  పాల్గొన్నారు. అన్ని కార్యక్రమాలు శ్రీ శ్రీ శ్రీ దేవనాథ స్వామి వారి మంగళా శాసనాలతో జరగడం పూర్వ జన్మ సుకృతం అని ఆలయ ధర్మకర్త శ్రీ నరసింహ రెడ్డి  అన్నారు. ఈ కార్యక్రమాల్లో  ఆలయ ప్రధాన ధర్మకర్త నర్సింహారెడ్డి తోపాటు సినీ నిర్మాతలైన దిల్ రాజు, శిరీష్ విజయసింహా రెడ్డి, డీసీపీ బసవ రెడ్డి , సాయ రెడ్డి, ఎంపీటీసీ రాములు, నర్సారెడ్డి, పృథ్వి, ప్రవీణ్, నరాల సుధాకర్, రమేష్, భాస్కర్, నరేందర్, గంగారెడ్డి, సాయిలు, రాములు, మురళి. యజ్ఞచార్యులు అనంత్ కుమార్ ఆచార్య తో పాటు ఆలయ అర్చక స్వాములు సంపత్ కుమారాచార్య , రోహిత్ కుమారాచార్యులు, విజయ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Tags: