114 యుద్ధవిమానాల కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

114 యుద్ధవిమానాల కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

త్రివిధ దళాల పోరాట సామర్థ్యాన్ని, వాయుసేన బలాన్ని మరింత పెంచే దిశగా కేంద్ర రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు వణుకు పుట్టించిన అత్యంత ఆధునిక రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. 

విశ్వంభర, నేషనల్ బ్యూరో: త్రివిధ దళాల పోరాట సామర్థ్యాన్ని, వాయుసేన బలాన్ని మరింత పెంచే దిశగా కేంద్ర రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు వణుకు పుట్టించిన అత్యంత ఆధునిక రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. దాదాపు రూ.3.60 లక్షల కోట్ల వ్యయంతో ఫ్రాన్స్‌తో చేపట్టనున్న ఈ అతిపెద్ద రక్షణ ఒప్పందానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఒప్పందం ప్రత్యేకతలు
మొత్తం 114 రఫేల్ యుద్ధ విమానాలను భారత వాయుసేన కోసం కొనుగోలు చేయనున్నారు. ఈ 114 విమానాలలో 88 సింగిల్ సీట్, 26 ట్విన్ సీట్ వేరియంట్లు ఉండనున్నాయి. రఫేల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్‌ ఈ విమానాలను సరఫరా చేయనుంది.

Read More పెళ్లి పేరుతో మోసం.. ఎమ్మెల్యే రాహుల్ కు 3 రోజుల పోలీస్ కస్టడీ

మేక్ ఇన్ ఇండియాకు ప్రాధాన్యత
ఈ కొనుగోలు ఒప్పందంలో 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి పెద్దపీట వేశారు. విమానాల తయారీ, అసెంబ్లీ వంటి ప్రక్రియల కోసం డసో ఏవియేషన్‌ భారత్‌లోని ప్రముఖ ప్రైవేట్ రంగ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. దీని ద్వారా సాంకేతికత బదిలీ జరగడమే కాకుండా స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఇప్పటికే భారత వాయుసేన వద్ద 36 రఫేల్ యుద్ధ విమానాలు విధులు నిర్వహిస్తున్నాయి.

ఫ్రాన్స్ అధ్యక్షుడి పర్యటన -అధికారిక ఒప్పందం
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఈ నెల 18న భారత పర్యటనకు రానున్నారు. ఈ కీలక పర్యటనకు ముందు రక్షణ శాఖ నుండి ఈ ఒప్పందానికి ఆమోదం లభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏడాది చివరి నాటికి ఇరు దేశాల మధ్య ఈ కొనుగోళ్ల కోసం అధికారిక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.