85 శాతం కంటిచూపు కోల్పోయిన మాజీ ప్రధాని
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి జైలులో అత్యంత దారుణంగా తయారైంది. రావల్పిండిలోని జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆయనకు అక్కడి సిబ్బంది అమానవీయంగా వ్యవహరిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి జైలులో అత్యంత దారుణంగా తయారైంది. రావల్పిండిలోని జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆయనకు అక్కడి సిబ్బంది అమానవీయంగా వ్యవహరిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. సుదీర్ఘకాలంగా జైలు గదిలో ఒంటరిగా ఉంచడంతో, ఇమ్రాన్ ఖాన్ కుడి కంటిచూపు 85 శాతం కోల్పోయినట్లు తెలుస్తోంది.
సుప్రీంకోర్టు నియమించిన న్యాయవాది జైలులో ఇమ్రాన్ ఖాన్ను కలిసి, ఆయన ఆరోగ్య స్థితిగతులను పరిశీలించి కోర్టుకు నివేదిక సమర్పించారు. మూడు, నాలుగు నెలల క్రితం వరకు చూపు సరిగ్గానే ఉండేదని, ఆ తర్వాత మసకబారడం మొదలైందని ఇమ్రాన్ న్యాయవాదితో పేర్కొన్నారు. ఈ విషయాన్ని జైలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారు పట్టించుకోలేదని, దాంతో పరిస్థితి విషమించిందని ఇమ్రాన్ వివరించారు.
ఏకాంతవాసంతో నరకం
రెండున్నరేళ్లుగా ఇమ్రాన్ ఖాన్ను ఒకే గదిలో ఒంటరిగా ఉంచారని నివేదికలు చెబుతున్నాయి. దీనివల్ల ఆయన శారీరక సమస్యలతో పాటు మానసిక ఆందోళనను కూడా ఎదుర్కొంటున్నారు. వైద్య పరీక్షలు సకాలంలో నిర్వహించడం లేదని, కుటుంబ సభ్యులను కూడా కలవకుండా జైలు అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. న్యాయవాది సమర్పించిన నివేదికపై స్పందించిన పాకిస్థాన్ సుప్రీం కోర్టు, ఇమ్రాన్ ఖాన్కు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. కంటిచూపు కోల్పోయే పరిస్థితికి దారితీసిన నిర్లక్ష్యంపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.



