అబుదాబి హిందూ దేవాలయం మూసివేత
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతుండటంతో గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
విశ్వంభర, బ్యూరో: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతుండటంతో గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేయడం, ప్రతిగా ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతుండటంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అబుదాబిలోని ప్రతిష్టాత్మక బీఏపీఎస్ హిందూ దేవాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆలయ యాజమాన్యం ప్రకటించింది. జాతీయ భద్రతా సంస్థల మార్గదర్శకాల ప్రకారం భక్తుల క్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యమని, ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. శాంతి నెలకొనాలని ప్రార్థిస్తూనే, పరిస్థితులు సద్దుమణిగాక దర్శనాలపై తదుపరి సమాచారం ఇస్తామని స్పష్టం చేసింది.
దుబాయ్ ఆకాశంలో క్షిపణుల విధ్వంసం
శనివారం తెల్లవారుజామున దుబాయ్ నగరం భారీ పేలుడు శబ్దాలతో దద్దరిల్లింది. ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లను యూఏఈ రక్షణ దళాలు గాలిలోనే అడ్డుకోవడంతో ఆకాశంలోనే భారీ విస్ఫోటనాలు సంభవించాయి. ఈ క్రమంలో జరిగిన ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందుతోంది. కేవలం దుబాయ్ మాత్రమే కాకుండా సౌదీ అరేబియా రాజధాని రియాద్లో కూడా ఇలాంటి పేలుడు శబ్దాలు వినిపించాయని అంతర్జాతీయ వార్తా సంస్థ ఏఎఫ్పీ ధ్రువీకరించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. యుద్ధం అంచున ఉన్న ఈ దేశాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అనిశ్చితి నెలకొంది.
భారతీయుల్లో ఆందోళన - నిలిచిన విమాన సర్వీసులు
యుద్ధం తీవ్రత పెరుగుతుండటంతో గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. క్షిపణి దాడుల ముప్పు పొంచి ఉండటంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. విమాన ప్రయాణాలు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లోనే చిక్కుకుపోయారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఈ సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దౌత్య పరమైన చర్చలు విఫలమైతే ఇది పూర్తిస్థాయి యుద్ధంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.



