అమీర్పేటలో భారీ అగ్నిప్రమాదం
భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న విద్యా కేంద్రం అమీర్పేటలో శుక్రవారం ఉదయం పెను ప్రమాదం సంభవించింది. మైత్రీవనం సమీపంలోని ప్రముఖ వాణిజ్య సముదాయం 'నీలగిరి బ్లాక్' భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా భయాందోళనలతో ఉలిక్కిపడింది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న విద్యా కేంద్రం అమీర్పేటలో శుక్రవారం ఉదయం పెను ప్రమాదం సంభవించింది. మైత్రీవనం సమీపంలోని ప్రముఖ వాణిజ్య సముదాయం 'నీలగిరి బ్లాక్' భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా భయాందోళనలతో ఉలిక్కిపడింది. భవనంలోని నాలుగో అంతస్తులో ఉన్న ఒక ప్రముఖ కోచింగ్ సెంటర్లో ప్రమాదం సంభవించగా, నిమిషాల వ్యవధిలోనే దట్టమైన పొగ భవనం మొత్తాన్ని కమ్మేసింది. తరగతులు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో వందలాది మంది విద్యార్థులు భవనం లోపల చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
కొనసాగిన సహాయక చర్యలు
కోచింగ్ సెంటర్కు వెళ్లే ప్రధాన ద్వారాలు పొగతో నిండిపోవడంతో విద్యార్థులు బయటకు వచ్చే మార్గం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది భారీ నిచ్చెనల సహాయంతో భవనం బాల్కనీల ద్వారా విద్యార్థులను కిందికి దించే ప్రయత్నం చేస్తున్నారు. భవనం కింద ఉన్న వ్యాపార సముదాయాలు, బిల్డింగ్ చుట్టూ ఉన్న భారీ హోర్డింగ్లు అగ్నిమాపక యంత్రాలు లోపలికి వెళ్లేందుకు అడ్డంకిగా మారాయి. ఈ క్రమంలో ఎవరైనా భయంతో కిందకు దూకినా లేదా ప్రమాదవశాత్తూ పడినా గాయాలు కాకుండా ఉండేందుకు భవనం చుట్టూ సేఫ్టీ నెట్లను ఏర్పాటు చేశారు.



