చెక్ డ్యామ్ పనులను పరిశీలన

చెక్ డ్యామ్ పనులను పరిశీలన

  • రూ. 65 లక్షలతో  మరమ్మ తులు 
  • తీరనున్న సాగునీటి కష్టాలు
  • ఎమ్మెల్యే నాగరాజు

విశ్వంభర, హనుమకొండ: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఆకేరు వాగుపై రూ. 65 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన చెక్ డ్యామ్ నిర్మాణ పనులను  వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు..
వర్ధన్నపేట పట్టణంతో పాటు పరిసర గ్రామాలలో భూగర్భ జలమట్టాన్ని పెంచడం, రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఆకేరు వాగుపై నిర్మిస్తున్న ఈ చెక్ డ్యామ్ వల్ల వందలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు, వేసవికాలంలో పశువులకు తాగునీటి కొరత తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో ఆకేరు వాగు అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు.  తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాగు పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారించి తక్షణమే రూ. 65 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, నియోజకవర్గంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నీటిపారుదల శాఖ అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: