ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి కవిత పేరు
On
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను ప్రశ్నించిన సిట్ అధికారులు, జోగినపల్లి సంతోష్ రావు విచారణలో కీలక సమాచారాన్ని సేకరించారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను ప్రశ్నించిన సిట్ అధికారులు, జోగినపల్లి సంతోష్ రావు విచారణలో కీలక సమాచారాన్ని సేకరించారు. అక్రమ నిఘా ద్వారా సంపాదించిన సమాచారంతో భారీ భూ కుంభకోణాలకు పాల్పడినట్లు ఆధారాలు లభించాయి.
కవిత పేరు ప్రస్తావన
ఈ వ్యవహారంలో మాజీ మంత్రి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేరు ప్రస్తావనకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాల వల్ల డిజిటల్ ఆధారాలు దొరికిపోతాయని ఆమె గతంలోనే ఒక మాజీ మంత్రిని హెచ్చరించినట్లు సమాచారం. మరోవైపు, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ ప్రమేయం ఉన్న భూ లావాదేవీలపై సిట్ దృష్టి సారించింది. ఈ అక్రమాలపై ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగి సమాచారాన్ని సేకరించింది.
ధరణి ద్వారా భూ దందాలు
అక్రమ మార్గాల్లో సేకరించిన సమాచారాన్ని అడ్డం పెట్టుకుని రంగారెడ్డి జిల్లాలో విలువైన భూముల సెటిల్మెంట్లు చేసినట్లు సిట్ గుర్తించింది. ధరణి పోర్టల్ను ఆయుధంగా చేసుకుని రాత్రికి రాత్రే భూ హక్కులను మార్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుకు అందిన ఆదేశాల మేరకు వివాదాల్లో ఉన్న వ్యక్తులను బెదిరించి ఈ సెటిల్మెంట్లు చేయించినట్లు తెలుస్తోంది.
తదుపరి అడుగు ఎటు?
కేసీఆర్ లాంటి అగ్రనేతల స్టేట్మెంట్లను రికార్డు చేసిన అధికారులు, ఇప్పుడు కవితను విచారిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో వెలుగు చూస్తున్న భూ కుంభకోణాలు, మనీ లాండరింగ్ కోణాలు రాజకీయ వర్గాల్లో వణుకు పుట్టిస్తున్నాయి. సిట్ తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.



