క్యాన్సర్ పై అవగాహన అవసరం
విశ్వంభర, బషీర్ బాగ్: క్యాన్సర్ వ్యాధి గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంపదించుకొని దాని నివారణ కొరకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ కన్జ్యూమర్స్ డిస్ప్యూట్ సెల్ కమిషన్ అధ్యక్షురాలు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి రాధా రాణి అన్నారు. బుధవారం ఖైరతాబాద్ లోని స్టేట్ కన్జ్యూమర్ కార్యాలయంలో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన క్యాన్సర్ వ్యాధి అవగాహన శిబిరంలో ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. క్యాన్సర్ గురించి అవగాహన పెంపొదించి దాని నివారణకు, చికిత్స ప్రోత్సహించాలని అన్నారు. సమాజంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. ఎం.ఎన్.జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజినల్ క్యాన్సర్ సెంటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గౌస్ మొహిద్దిన్ మాట్లాడుతూ, పొగాకు సేవించడం వల్ల 14 రకాల క్యాన్సర్ కు కారణం అవుతుంది అన్నారు. పొగాకులో 800 రకాల క్యాన్సర్ కారకాలు ఉంటాయని పొగాకు పీల్చినప్పుడు ఆ రసాయనాలు ఊపిరితిత్తుల్లోకి చేరి ఊపిరితిత్తుల క్యాన్సర్ నోటి క్యాన్సర్ వస్తాయని వివరించారు. తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధి నివారణ తీసుకోవలసిన జాగ్రత్తలపై ర్యాలీలు, సదస్సులు ల ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులకు, యువకులకు , గ్రామీణ ప్రాంతంలోని నిరుపేదలకు ఎన్నో అవగాహన శిబిరాలు నిర్వహించారని వివరించారు. ఈ సదస్సులో మాజీ అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సిఎన్ సిఎల్ఎన్ గాంధీ, కోఆర్డినేటర్లు జి వేణుగోపాల్, బిచ్చు కారి ఆరెకటిక సూర్య తదితరులు పాల్గొన్నారు.



