మణిపుర్ సీఎంగా ఖేమ్చంద్ సింగ్ ప్రమాణస్వీకారం
On
సుదీర్ఘ కాలం తర్వాత మణిపుర్ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పునరుద్ధరణ అయింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా యుమ్నమ్ ఖేమ్చంద్ సింగ్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: సుదీర్ఘ కాలం తర్వాత మణిపుర్ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పునరుద్ధరణ అయింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా యుమ్నమ్ ఖేమ్చంద్ సింగ్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మణిపూర్లో కొనసాగుతున్న రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ బుధవారం ఉదయం కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాలనా పగ్గాలు మళ్ళీ ప్రజాప్రతినిధుల చేతుల్లోకి వచ్చాయి.
2023 మే నెల నుంచి మణిపుర్ రాష్ట్రం జాతుల మధ్య చెలరేగిన హింసతో అట్టుడికింది. శాంతిభద్రతల సమస్యల నేపథ్యంలో గతేడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. బీరెన్ సింగ్ తప్పుకున్న సమయం నుంచి నేటి వరకు రాష్ట్రం కేంద్రం నిఘాలో, రాష్ట్రపతి పాలన కింద కొనసాగింది. నలభై స్థానాలకు పైగా బలం ఉన్న కూటమికి నాయకత్వం వహిస్తున్న ఖేమ్చంద్ సింగ్, రాష్ట్రంలో శాంతి స్థాపనకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు. నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు.



