ఇందిరమ్మ ఇళ్ళు ప్రారంభించిన బిఎల్ఆర్
విశ్వంభర, మిర్యాలగూడ: మిర్యాలగూడ మండలం కేశవపురం, రామోజీ తండా గ్రామంలోని లబ్ధిదారుల పలు నూతన ఇందిరమ్మ ఇళ్ళను శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్దిదారులు వారి కుటుంబ సభ్యులు ప్రజా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఏర్పాటైనా రెండున్నర సంవత్సరాలలో మన మిర్యాలగూడ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి పేద కుటుంబాల సొంత ఇంటి కలను నెరవేర్చాము అని అన్నారు. అతిత్వరలోనే మిర్యాలగూడ పట్టణంలో కూడా 2500 ఇళ్లకు శ్రీకారం చుట్టబోతున్నాము అని అన్నారు. గత ప్రభుత్వంలో పేద ప్రజల సంక్షేమం పక్కకు పెట్టి కమిషన్ ల కోసం రాష్టాన్ని అప్పుల కుప్పగా చేసింది అని అన్నారు.. ప్రజా ప్రభుత్వంలో పేద కుటుంబాలకు సన్నబియ్యం, నూతన రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ళు లాంటి అనేక సంక్షేమాలను పేద ప్రజలకు అందించి వారి అందరి ఆశీస్సులతో మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో, నిన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వానికి నిరాజనాలు పలికి అధిక స్థానాల్లో ఆశీర్వధించారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ, మండల నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



