వైభవంగా వీరభద్ర స్వామి కల్యాణం
విశ్వంభర, సంగారెడ్డి: గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానాన్ని రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆలయ వార్షికోత్సవ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కళ్యాణ మహోత్సవం, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రోజురోజుకీ పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా దేవాలయాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తున్నామని తెలిపారు. ఆలయం ఆవరణలో నాలుగు ప్రాకారాల నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. గతంలో ఆలయ అభివృద్ధికి 50 లక్షల రూపాయల విరాళం సైతం అందజేసినట్లు గుర్తు చేశారు. ఆలయ ప్రధాన గోపురం నిర్మాణానికి సైతం సహకారం అందిస్తున్నామని తెలిపారు. భక్తుల సంఖ్యకు అనుగునంగా మరిన్ని వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్య గోవర్ధన్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, సీనియర్ నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, షేక్ హుస్సేన్, ఆలయ ఈఓ శశిధర్, కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



