జీఎస్టీ సంస్కరణలు – దేశంలో విప్లవాత్మక మార్పుకు నాంది. – ఎం. వెంకయ్య నాయుడు
డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావుకు వెంకయ్య నాయుడి అభినందన
On
విశ్వంభర, హైదరాబాద్ ;- తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు రచించిన జీఎస్టీపై గ్రంథాన్ని హైదరాబాద్లోని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు నివాసంలో మర్యాదపూర్వకంగా అందజేశారు. ఈ సందర్భంగా డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావును ఆయన అభినందించారు.జీఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థలో మౌలికమైన, విప్లవాత్మక మార్పులకు నాంది పలికినవని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం, అభివృద్ధి అనే అంశాలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి జీఎస్టీ సంస్కరణలను విశ్లేషించిన తీరు ఈ గ్రంథానికి ప్రత్యేకతగా నిలిచిందని పేర్కొన్నారు.పన్నుల వ్యవస్థలో ఏకీకరణ ద్వారా దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్ ఏర్పడిన విధానం, పారదర్శకత పెరగడం, పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం కలగడం వంటి అంశాలను ఈ గ్రంథం స్పష్టంగా ప్రతిపాదించిందని తెలిపారు. కేంద్రం–రాష్ట్రాల మధ్య ఆర్థిక సమన్వయం బలోపేతం కావడంలో జీఎస్టీ పాత్రను కూడా ఈ రచన సమగ్రంగా వివరించిందని అభిప్రాయపడ్డారు.ఆర్థిక సంస్కరణలను కేవలం గణాంకాల పరంగా కాకుండా, ప్రజల జీవితాలతో అనుసంధానిస్తూ సామాజిక కోణంలో విశ్లేషించిన తీరు ప్రశంసనీయమని పేర్కొన్నారు. విద్యార్థులు, పరిశోధకులు, విధాన నిర్ణేతలు మాత్రమే కాకుండా, సాధారణ ప్రజలకు కూడా జీఎస్టీపై అవగాహన పెంపొందించడంలో ఈ గ్రంథం ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.ఈ గ్రంథాన్ని ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఆవిష్కరణ అనంతరం ఈ రచనకు లభించిన స్పందన జీఎస్టీ అంశంపై సమాజంలో ఉన్న ఆసక్తిని ప్రతిబింబిస్తోందని అభిప్రాయపడ్డారు.డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ, జీఎస్టీ సంస్కరణల ఉద్దేశ్యం, అమలు విధానం, ప్రజలపై వాటి ప్రభావాన్ని సుస్పష్టంగా ప్రజల ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ గ్రంథాన్ని రచించినట్లు తెలిపారు. తన రచనకు ఆశీస్సులు, ప్రోత్సాహం అందించిన వెంకయ్య నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు.



