ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

కోల్‌కతా నుండి మేఘాలయాలోని షిల్లాంగ్‌కు బయలుదేరాల్సిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో విమానాశ్రయంలో కలకలం రేగింది. 

విశ్వంభర, నేషనల్ బ్యూరో: కోల్‌కతా నుండి మేఘాలయాలోని షిల్లాంగ్‌కు బయలుదేరాల్సిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో విమానాశ్రయంలో కలకలం రేగింది. ఈ ఘటనకు సంబంధించి అధికారులు వెంటనే స్పందించి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపేశారు. విమానంలో బాంబు ఉందనే సమాచారంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. కోల్‌కతా విమానాశ్రయం నుండి ఉదయం 9:15 గంటలకు బయలుదేరాల్సిన ఇండిగో విమానం కోసం ప్రయాణికులు బోర్డింగ్ ప్రక్రియను పూర్తి చేసుకుంటున్నారు. ఆ సమయంలో విమాన సిబ్బంది టాయిలెట్ కంపార్ట్‌మెంట్‌లో ఒక టిష్యూ పేపర్‌ను గుర్తించారు. ఆ పేపర్‌పై విమానంలో బాంబు అమర్చినట్లు బెదిరింపు నోట్‌ రాసి ఉండటంతో సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించారు.

అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు విమానాన్ని వెంటనే ఐసోలేషన్‌ బే ఏరియాకు తరలించారు. అనంతరం ప్రయాణికులందరినీ విమానం నుండి కిందకు దింపి, వారి సామాగ్రిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బాంబు నిర్వీర్య దళాలు, పోలీసులు విమానంలోని ప్రతి అంగుళాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ ఘటనపై ఇండిగో ప్రతినిధులు స్పందిస్తూ.. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, సంబంధిత అధికారులతో కలిసి పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు.

Read More ఇండియా ధైర్యానికి సజీవ సాక్ష్యమే సోమనాథ్: మోదీ

Related Posts