"నల్గొండ అంటేనే కాంగ్రెస్": మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరోసారి కాంగ్రెస్ పార్టీ తన పట్టును నిరూపించుకుంది. 'నల్లగొండ అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే నల్లగొండ' అనే నానుడిని నిజం చేస్తూ, స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయాన్ని నమోదు చేసింది. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరోసారి కాంగ్రెస్ పార్టీ తన పట్టును నిరూపించుకుంది. 'నల్లగొండ అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే నల్లగొండ' అనే నానుడిని నిజం చేస్తూ, స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయాన్ని నమోదు చేసింది. కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకోవడమే కాకుండా, జిల్లావ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటారు. ఈ భారీ విజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఎన్నికల ఫలితాల అనంతరం నల్లగొండ క్లాక్‌టవర్ సెంటర్‌లో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఈ విజయం ప్రజల నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పరంపర కొనసాగుతోందని, అందులో భాగంగానే నల్లగొండలో ఈ చారిత్రాత్మక విజయం సాధ్యమైందని ఆయన వ్యాఖ్యానించారు.

హైదరాబాదుకు దీటుగా అభివృద్ధి
నల్లగొండను కేవలం జిల్లా కేంద్రంగానే కాకుండా, హైదరాబాదుకు దీటుగా అభివృద్ధి చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. పట్టణాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నామని, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తయిన వెంటనే కార్పొరేషన్ పరిధిలో భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని తెలిపారు. ఎన్నికలలో గెలుపోటములు సహజమని పేర్కొంటూ, ఓడిపోయిన అభ్యర్థులు అధైర్యపడకుండా డివిజన్ సమస్యలపై తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వారానికి రెండు రోజులు నల్లగొండలోనే ఉండి పేద ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుంటానని వెల్లడించారు. అంతేకాకుండా, ఇకపై ప్రతి డివిజన్‌లో ప్రజా దర్బారు నిర్వహించి, నేరుగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. 

Read More అన్నదాత ఆవేదన. - సోలిపేట ఐకేపీ కేంద్రంలో అక్రమాలు - రైతుల ఖాతాల్లో మాయమవుతున్న సొమ్ము - కలెక్టర్ స్పందించాలని బాధితుల డిమాండ్

బీఆర్ఎస్ ఆత్మవిమర్శ చేసుకోవాలి
నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి, భారీ మెజారిటీతో గెలిపించినందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఈ ఓటమిని అంగీకరించి, ఎందుకు ఓడిపోయామో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి, రాజకీయ క్రీడలకు పాల్పడినందుకే ప్రజలు వారికి బుద్ధి చెప్పారని ఆయన స్పష్టం చేశారు. ఇకముందు రాజకీయాలకు అతీతంగా, ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని ఆయన మాట ఇచ్చారు.