బీసీ గురుకుల పాఠశాల తనిఖీ
విశ్వంభర, సిద్దిపేట: వర్గల్ మండలంలోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీని కలెక్టర్ హైమావతి సోమవారం ఆకస్మికంగా తనిఖీచేసి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మల్లె చెట్లు, వివిధ రకాల పూలను చూస్తూ ఆనందం వ్యక్తం చేశారు. వేసవి కాలం దృష్టా నీరు బాగా పెట్టాలని సూచించారు. గురుకుల వాతావరణం చెట్లతో ఆహ్లాదకరంగా ఉందని అభినందించారు. అన్నం, వంకాయ, పాలకూర పప్పు, రసం, గుడ్డు, పెరుగులను పరిశీలించారు. కామన్ డైట్ మెనూ పాటిస్తూ రోజు విద్యార్థుల హాజరు ప్రకారం వంట సరుకులు పంపిణీ చేసి రుచికరంగా వండే విధంగా చూసుకోవాలని, ప్రతీ వంటకం విద్యార్థులకు సరిపోయేలా వండాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి ప్రార్థన చేసి భోజనం చేశారు. టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం ఎలా ఉంటాయని, వసతుల విషయంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అని ఆరా తీశారు. స్టోర్ రూమ్ సరుకులు తనిఖీచేసి బియ్యం, పప్పులు ఇతరత్ర సామగ్రి చెడిపోకుండా చూసుకోవాలని ప్రిన్సిపాల్ను ఆదేశించారు.



