ప్రకృతి సంరక్షణే మన జీవన విధానం
పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
జాతి నిర్మాణంలో రైతులు అత్యంత బలమైన భాగస్వాములని, వారి నిరంతర శ్రమ 'ఆత్మనిర్భర్ భారత్' (స్వావలంబన భారత్) లక్ష్యాన్ని బలోపేతం చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: జాతి నిర్మాణంలో రైతులు అత్యంత బలమైన భాగస్వాములని, వారి నిరంతర శ్రమ 'ఆత్మనిర్భర్ భారత్' (స్వావలంబన భారత్) లక్ష్యాన్ని బలోపేతం చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. రైతుల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వారి సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ నివాసంలో నిర్వహించిన 'పొంగల్' వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల ప్రాముఖ్యతను, భారతీయ సంస్కృతిని కొనియాడారు. దేశ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ కీలక ప్రసంగం చేశారు.
తమిళ సంస్కృతి.. మానవాళి వారసత్వం
తమిళ సంస్కృతి యొక్క ప్రాచీనతను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఇది కేవలం భారతదేశానికే కాకుండా మొత్తం మానవాళికి ఉమ్మడి వారసత్వమని అన్నారు. తమిళ సంస్కృతిలో రైతును 'జీవితానికి పునాది'గా భావిస్తారని, ఆ స్ఫూర్తితోనే భారతదేశం తన మూలాల నుండి బలాన్ని పొందుతూ కొత్త అవకాశాల వైపు దూసుకుపోతోందని మోదీ వ్యాఖ్యానించారు.
ఏక్ భారత్ -శ్రేష్ఠ భారత్ స్ఫూర్తి
దేశంలోని వైవిధ్యాన్ని, ఐక్యతను పండుగలు ప్రతిబింబిస్తాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పొంగల్ ఇప్పుడు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచ పండుగగా మారిందని, ఇది మన రైతుల కృషికి దక్కిన గౌరవమని అన్నారు. ఒకవైపు పొంగల్ జరుపుకుంటుంటే.. దేశంలోని ఇతర ప్రాంతాల్లో లోహ్రీ, మకర సంక్రాంతి, మాఘ బిహు పండుగలు 'ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని చాటుతున్నాయని మోదీ వివరించారు. ప్రకృతి, కుటుంబం, సమాజం మధ్య సమతుల్యతను ఎలా కాపాడుకోవాలో పొంగల్ మనకు నేర్పుతుందని మోదీ చెప్పారు.
ప్రకృతి సంరక్షణే మన జీవన విధానం
ప్రకృతి పట్ల కృతజ్ఞత కేవలం మాటల్లోనే కాకుండా, అది మన జీవనశైలిలో భాగం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, దేశానికి అన్నం పెట్టే రైతుల కష్టానికి ఇచ్చే గౌరవమని పేర్కొన్నారు. నేలతల్లికి, సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపే గొప్ప సందర్భమని అన్నారు. నేల తల్లి మనకు ఎన్నో వనరులను అందించిందన్నారు. ఆ వనరులను భవిష్యత్తు తరాల కోసం కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. నేల ఆరోగ్యాన్ని కాపాడటం, నీటి సంరక్షణ మన తక్షణ కర్తవ్యమని స్పష్టం చేశారు. ఈ దిశగా ప్రభుత్వం చేపట్టిన మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మా కే నామ్, అమృత్ సరోవర్ వంటి కార్యక్రమాలు పర్యావరణ స్పృహను పెంపొందిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.



