గురువులకు శిష్యుల సత్కారం
విశ్వంభర , సిద్దిపేట: వాళ్లంతా ఏడు పదుల వయస్సు దాటిన వారే. వివిధ రంగాలలో లబ్ద ప్రతిష్టులు. తమకు పాఠాలు బోధించిన లెక్చరర్లను వినూత్నంగా సత్కరించారు. సాధారణంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాలలో గురువులను సత్కరించడం మామూలే. అందుకు భిన్నంగా 51 సంవత్సరాల క్రితం డిగ్రీలో తమకు పాఠాలు బోధించిన మాజీ ఎమ్మెల్సీ, ఐఐటీ రామయ్య (మ్యాథ్స్), మధుసూదన్ (ఫిజిక్స్), నాగేశ్వరరావు (కెమిస్ట్రీ)లను హైదరాబాద్లోని వారి ఇళ్ల వద్దకే వెళ్లి బుధవారం శాలువా కప్పి బొకే, పండ్లు అందజేసి సత్కరించారు. 1975లో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఎంపీసీ విద్యనభ్యసించిన తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లుగా పదవీ విరమణ చేసిన డా.నాగభూషణం, కిష్టయ్య, లెక్చరర్ గా రిటైరైనా సంపత్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ కొమురవెల్లి అంజయ్య, వివిధ రంగాలకు చెందిన బి మల్లేశం, నర్సింహారెడ్డి, లక్ష్మీనారాయణ, చింత సత్యనారాయణ, గాల్ రెడ్డి, రామచంద్రమూర్తి, యస్ యన్ చారి, పీ.లక్ష్మీనారాయణ, గౌరయ్య, జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



