ఇకపై ప్రతివారం ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు: భట్టి
విశ్వంభర తెలంగాణ, బ్యూరో : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లుల మంజూరుపై కీలక నిర్ణయం తీసుకుంది.
విశ్వంభర తెలంగాణ, బ్యూరో : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లుల మంజూరుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇందిరమ్మ ఇళ్ల పనులకు ప్రతి వారం బిల్లులు క్లియర్ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. లబ్ధిదారులు ఆలస్యం చేయకుండా ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. అలాగే, బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు నిధుల లభ్యతను బట్టి సోమవారాల్లో బిల్లులు మంజూరు చేస్తూ వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిందని తెలిపారు. ఈ పథకానికి మొత్తం రూ.22,500 కోట్ల వ్యయం చేస్తున్నట్లు వెల్లడించారు. స్వంత స్థలం ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గోదావరిఖనిలో పర్యటించి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.175 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చాలన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పనిచేస్తోందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆ లక్ష్యానికి అనుగుణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని అన్నారు. ఇప్పటికే ఈ పథకం కింద దశల వారీగా లబ్ధిదారులను గుర్తించి ఇళ్ల మంజూరు ప్రక్రియ కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం ముందస్తు సన్నాహాలు చేస్తోంది. 2026 ఏప్రిల్ నుంచి ఈ రెండో దశ ప్రారంభం కానుంది. ఈ విడతలో మధ్యతరగతి కుటుంబాలకు కూడా ప్రత్యేకంగా ఇళ్లను కేటాయించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో జీ ప్లస్ త్రీ, జీ ప్లస్ ఫోర్ నమూనాలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
మరోవైపు, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని వేగంగా అమలు చేయడానికి అవసరమైన విధివిధానాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే ఈ పథకానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల 50 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, ప్రతి నియోజకవర్గానికి మరోసారి 3,500 చొప్పున ఇళ్ల మంజూరుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది.



