చేనేత రుణమాఫీ, భరోసా అమలు చేయాలని కార్మికుల ధర్నా
On
విశ్వంభర, చండూరు ;- చేనేత కార్మికులకు వెంటనే రుణమాఫీ చేసి,చేనేత భరోసా పథకాన్ని అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న త్రిఫ్ట్ ఫండ్ నిధులను విడుదల చేయాలని చండూరు మున్సిపాలిటీకి చెందిన చేనేత కార్మికులు శనివారం ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. చేనేత కార్మికుల సమస్యలపై నినాదాలు చేశారు. చేనేత రుణమాఫీ ప్రకటించి పది నెలలు అవుతున్నా నేటికి అతిగతి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక కుటుంబానికి నెలకు 2,000 చొప్పున అందించాల్సిన చేనేత భరోసా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని, ఇందుకు కావలసిన పత్రాలను కార్మికులు సమర్పించారని కానీ నేటికీ నెలలు అవుతున్న పథకం కాగితాలకే పరిమితమైందని తెలిపారు. నెలవారీగా త్రిఫ్ట్ ఫండ్ పథకం కింద జమ చేస్తున్న మొత్తానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా పెండింగ్ లో ఉందని వెంటనే పెండింగ్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చేనేత రుణమాఫీ విషయంలో ప్రభుత్వం కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని నిర్లక్ష్యం వీడకుంటే ఆందోళన బాట పట్టక తప్పదని.... ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు. అనంతరం ఎమ్మార్వో చంద్రశేఖర్,ఆర్ఐ ప్రసన్నలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చేనేత పరిరక్షణ సేవా సమితి వ్యవస్థాపకుడు రాపోలు ప్రభాకర్, సంగెపు విష్ణుమూర్తి, గజం రాజు, చెరుపల్లి రాజు, గంజి వెంకటేశం, చెరుపల్లి సుదర్శన్, రుద్ర మార్కండేయ, వనం రామకృష్ణ, రావిరాల శ్రీను, కర్నాటి రవి, ఆనందపు యాదయ్య, తిరందాసు బిక్షమయ్య,తదితరులు పాల్గొన్నారు.



