ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
విశ్వంభర, హైదరాబాదు : సీఎం రేవంత్ రెడ్డికి పాలనపై అవగాహనే లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఉదయం లేవగానే రాహుల్ ఫోన్ కోసం వేచి చూస్తూ ఢిల్లీ వెళ్లాలా లేదా? అనే ఆలోచిస్తారే తప్ప రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోరని ఆరోపించారు. మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్, కాంగ్రెస్ లు కలిసి అప్పుల ఊబిలోకి తోశాయన్నారు. ఇచ్చిన గ్యారంటీలు, హామీల అమలు దేవుడెరుగు ఉన్న ఉద్యోగులకు, అవసరాలకే రాష్ర్టంలో నిధులు లేవని ఆరోపించారు. తెలంగాణను బంగారు మయం చేస్తానని కుటుంబాన్ని కేసీఆర్ బంగారు మయం చేసుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రియల్ రంగం పూర్తిగా కుదేలయ్యిందన్నారు. కుప్పకూలే పరిస్థితిలో ఉందని మండిపడ్డారు. ఇలా అన్ని రంగాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. ఇచ్చిన గ్యారంటీలు, హామీలను నెరవేర్చకుండా తనతో చర్చకు వస్తాననడం ఆయన చేతకానితనానికి నిదర్శనమన్నారు. గ్యారంటీలు, హామీలను నెరవేర్చి తనతో చర్చకు రావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.



