నిందితుడిని కఠినంగా శిక్షించాలి
విశ్వంభర, మర్పల్లి: నాగర్ కర్నూల్లో జిల్లా కొమ్మెర గ్రామంలో జరిగిన జాతర సందర్భంగా కులం పేరుతో దూషణ, దాడి ఘటనలో రెండు నెలల పసికందు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని బీజేవైఎం మర్పల్లి మండల అధ్యక్షుడు మధుకర్ డిమాండ్ చేశారు. జాతరలో గుడి దర్శనానికి రూ.100 టోకెన్ తీసుకున్నప్పటికీ స్లిప్ ఇవ్వలేదని ప్రశ్నించగా.. శ్రీవాణిని కులం పేరుతో దూషించి దాడి చేశారని ఆరోపించారు. అడ్డుకోవడానికి వచ్చిన ఆమె తమ్ముడిని గదిలో బంధించి తీవ్రంగా కొట్టారని తెలిపారు. ఈ దాడి కారణంగా రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోయిందని, బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, నిందితుడిని తక్షణం అరెస్టు చేయాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని మధుకర్ కోరారు.



