ఎన్నికల నియమావళి కచ్చితంగా పాటించాలి
- కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
విశ్వంభర, సూర్యాపేట: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రతి మున్సిపాలిటీ కేంద్రంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ సముదాయంలోని వి.సి. హాల్ లో ఎస్పీ, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రతి మున్సిపల్ కేంద్రంలో జోనల్ ఆఫీసర్, ఆర్వో ల వారీగా డి.ఆర్.సి.కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఈ కేంద్రాలలో పోలింగ్ సిబ్బందికి మౌలిక సదుపాయాలు కల్పించాలని , అలాగే పోలింగ్ రోజు కూడా సిబ్బందికి భోజనాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి బ్యాలెట్ బాక్స్ లు, బ్యాలెట్ పేపర్, సిబ్బంది పోలింగ్ కేంద్రానికి ఎస్కార్ట్ వాహనంతో మాత్రమే వెళ్లాలని, ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టి టీం సభ్యులు చురుకుగా ఉండి డబ్బు, మద్యం పంపిణీ జరిగితే చర్యలు తీసుకోవాలని, ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి ప్రచారం బంద్ చేయాలని అలాగే మున్సిపల్ ఏరియాలో సాయంత్రం 5 గంటల నుండి 11 తారీకు పోలింగ్ ముగిసే వరకు మద్యం షాపులు బంద్ చేయించాలని ఎక్సైజ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్ లను డి జి టి వాహనంలో ముందు, వెనుక ఎస్కార్ట్ వాహనాలతో మాత్రమే స్ట్రాంగ్ రూములకు తరలించాలని, మిగిలిన బ్యాలెట్ పేపర్లను జాగ్రత్తగా కవర్లో పెట్టి సీల్ వేయాలని, పోస్టల్ బ్యాలెట్ పేపర్లను వార్డుల వారీగా విభజించి కౌంటింగ్ కేంద్రాలకు తరలించాలని చెప్పారు. జోనల్ ఆఫీసర్లు, ఆర్వోలు, ఎన్నికల సిబ్బంది ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి పని చేయాలని, నిబంధనలు అతిక్రమించే సిబ్బందిపై ఎన్నికల సంఘం నిబంధన ప్రకారం చర్యలు తీసుకుంటారని కావున ఎన్నికల సిబ్బంది అందరూ బాధ్యతగా పనిచేయాలని తెలిపారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను దిగ్విజయంగా, విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కె సీతా రామా రావు, డిప్యూటీ సీఈవో శిరీష, డిపిఓ నారాయణరెడ్డి, ఎస్సీ సంక్షేమ అధికారి దయానంద రాణి, బీసీ సంక్షేమ అధికారి నరసింహ, సి సెక్షన్ సూపర్డెంట్ సంతోష్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.



