జీవ వైవిధ్య పరిరక్షణ–యువత సాధికారతే లక్ష్యం

జీవ వైవిధ్య పరిరక్షణ–యువత సాధికారతే లక్ష్యం

  • మంత్రి కొండా సురేఖ

విశ్వంభర, హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో జీవ వైవిధ్య పరిరక్షణతో పాటు యువత సాధికారతను లక్ష్యంగా పెట్టుకుని నిర్వహించిన అంతర్జాతీయ యువ జీవ వైవిధ్య సదస్సు–2026 ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు దేశ, విదేశాల నుంచి యువత, పర్యావరణ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విధాన రూపకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ముగింపు కార్యక్రమానికి అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనలో యువత పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. సదస్సులో జీవ వైవిధ్య సంరక్షణ, పర్యావరణ అనుకూల జీవనశైలి, యువత నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై సాంకేతిక సదస్సులు, చర్చలు నిర్వహించారని,యువతలో పర్యావరణ అవగాహన పెంపొందించడంతోపాటు ప్రకృతి పరిరక్షణకు సంబంధించిన ఆవిష్కరణలు, పరిశోధనలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు. జీవ వైవిధ్య సంరక్షణ రంగంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు  అంతర్జాతీయ వేదికపై ప్రతిష్ఠాత్మకంగా నిలుస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్ తరాల కోసం ప్రకృతి సంపదను కాపాడే దిశగా యువత ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత, డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం కేంద్రం సహ-స్థాపకులు మరియు సీఈఓ సృజన్ పాల్ సింగ్, అలాగే తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి సభ్య కార్యదర్శి కాలీచరణ్ పాల్గొన్నారు.

Tags: