రాష్ట్ర క్రీడల్లో జిల్లా పోలీసుల ప్రతిభ
- అభినందించిన ఎస్పీ నరసింహ
విశ్వంభర,సూర్యాపేట: 4వ రాష్ట్ర పోలీసు క్రీడా పోటీల్లో సూర్యాపేట జిల్లా పోలీస్ క్రీడాకారులు వివిధ క్రీడల్లో ప్రతిభ చూపారు. హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్ లో నిర్వహించిన ఈ క్రీడల్లో యాదాద్రి జోన్ తరపున జిల్లా పోలీసు క్రీడాకారులు కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ , కోకో, అథ్లెటిక్స్ క్రీడల లో ప్రాతినిధ్యం వహించారు. జిల్లా పోలీసు నుండి ప్రాతినిధ్యం వహించి బహుమతులు పొందిన పోలీస్ క్రీడాకారులను సోమవారం ఎస్పీ నరసింహ అభినందించారు. యాదాద్రి జోన్ కబడ్డీ పోటీల్లో మహిళా విభాగంలో ప్రథమ స్థానం, వాలీబాల్ పోటీల్లో మహిళా విభాగంలో తృతీయ స్థానం సాధించింది, బ్యాడ్మింటన్ లో మహిళా విభాగంలో తృతీయ స్థానం సాధించింది. పురుషుల విభాగంలో అథ్లెటిక్స్ లో ఆర్ఎస్ఐ మహేష్ 1500 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్, ఐదు కిలోమీటర్ల పరుగు పందెంలో సిల్వర్ మెడల్ సాధించారు. అలాగే కానిస్టేబుల్ స్వామి జావెలిన్ త్రో లో గోల్డ్ మెడల్ సాధించారు.
జాతీయస్థాయి పోలీస్ క్రీడలకు ఎంపిక
జాతీయస్థాయి పోలీసు క్రీడా పోటీలకు జిల్లా పోలీసు నుండి పోలీసు క్రీడాకారులు ఎంపికయ్యారు. కబడ్డీ జట్టులో ప్రాతినిధ్యం వహించిన ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు చెందిన మహిళా కానిస్టేబుల్ దీపిక, జిల్లా ఆర్మూడ్ పోలీసు విభాగానికి చెందిన మహిళా కానిస్టేబుళ్లు అనూష, శిరీష లు జాతీయస్థాయిలో జరగనున్న కబడ్డీ పోలీసు క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. జాతీయస్థాయిలో జరగనున్న వాలీబాల్ పోటీలకు జిల్లా ఆర్మూడ్ పోలీసు విభాగానికి చెందిన మహిళా కానిస్టేబుల్ లావణ్య ఎంపికయ్యారు, కోకో క్రీడా పోటీలకు జిల్లా ఆర్మూడ్ పోలీసు విభాగానికి చెందిన మహిళా కానిస్టేబుళ్లు దివ్యభారతి, అనూష ఎంపికయ్యారు. ఈ సందర్భంగా బహుమతులు పొందిన పోలీస్ క్రీడాకారులను జిల్లా ఎస్పీ నరసింహ అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.



