త్వరలో కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటన

త్వరలో కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటన

రాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకోనున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించి రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచారు. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకోనున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించి రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచారు. బాగ్ లింగంపల్లిలో నిర్వహించిన 'ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ'లో పాల్గొన్న ఆమె, గత పదేళ్ల పాలనతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు
ఉద్యమకారుల విషయంలో బీఆర్ఎస్ వైఖరిపై కవిత విమర్శలు గుప్పించారు. పదేళ్ల కాలంలో ఉద్యమకారులకు అన్ని చేదు జ్ఞాపకాలే మిగిలాయని, వారికి సరైన న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమవాళ్లే గాయం చేస్తే ఆ నొప్పి ఎక్కువగా ఉంటుందని.. ఉద్యమకారులు బయట ఉండి బాధపడితే, తాను బీఆర్ఎస్‌లో ఉండి బాధపడ్డానని పేర్కొన్నారు. అహంకారం, సహనశీలత లేకపోవడం వల్లే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిందని విశ్లేషించారు. మంచితనం, భోళాతనం తెలంగాణ తత్వమని, అవి కోల్పోతే మనల్ని మనం కోల్పోయినట్లేనని స్పష్టం చేశారు.

Read More బంగ్లాదేశ్ ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం.-హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసన. - విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి జూకురి సంపత్ వర్మ 

త్వరలో రాజకీయ పార్టీ.. అస్తిత్వమే ఊపిరి
తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని పెట్టబోతున్నట్లు కవిత వెల్లడించారు. ఇది కేవలం ఎన్నికల కోసం పెట్టే ఫక్తు రాజకీయ పార్టీ కాదని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే వేదిక అని వివరించారు. 1995 వరంగల్ డిక్లరేషన్‌తో మొదలైన మలిదశ ఉద్యమంలో మారోజు వీరన్న, గద్దర్ వంటి విప్లవకారుల పాత్రను గుర్తుచేస్తూ, వారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.

ప్రొఫెసర్ కోదండరామ్‌కు హెచ్చరిక
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉద్యమ సోయి లేదని కవిత విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే రాబోయే బడ్జెట్ తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అయితే తాను రేవంత్ రెడ్డిని కాదని, ప్రొఫెసర్ కోదండరామ్, ఆకునూరి మురళిని హెచ్చరిస్తున్నానని పేర్కొన్నారు. వీరిద్దరూ రేవంత్ రెడ్డితో కలవబట్టే కాంగ్రెస్‌ను నమ్మామని.. కానీ రెండేళ్లుగా వారు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు రేవంత్ రెడ్డిని భవనం నుంచి బయటకు లాగుతారని వ్యాఖ్యానించారు.

20 శాతం రిజర్వేషన్ డిమాండ్
తెలంగాణ బిడ్డలకు ప్రైవేట్ ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక వృద్ధి, రాజకీయ అవకాశాలు కల్పించడంలో అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ట్యాంక్ బండ్ పై, కేబీఆర్ పార్క్ వద్ద జయశంకర్ సార్ విగ్రహం పెట్టుకోలేకపోవడం బాధాకరమని, నాడు మున్సిపల్ మంత్రిని కోరినా ఫలితం లేకపోయిందని గుర్తుచేశారు. తెలంగాణ గడ్డ నిత్యం పోరాటాల గడ్డ అని, ఉద్యమకారుల కోసం మరో పోరాటం తప్పదని పిలుపునిచ్చారు.