కేటీఆర్ మీ ఫ్యామిలీనే ఒక 420.. మమ్మల్ని 420 అంటారా..? : జగ్గారెడ్డి
- సీఎం రేవంత్ నిధుల కోసం ఢిల్లీ వెళ్తే.. కేసీఆర్ కుటుంబం లిక్కర్ దందా కోసం ఢిల్లీ వెళ్లింది
- అందరికీ వడదెబ్బ తగిలితే.. కేటీఆర్ కి సిస్టర్.. బ్రదరిన్ల స్ట్రోక్ తగిలింది..
- మా రాజకీయ అనుభవం ముందు కేటీఆర్ జీరో..కేటీఆర్ సర్పంచ్గానైనా గెలిచారా?
- ముఖ్యమంత్రి రేవంత్ తో చర్చించే స్థాయి కేటీఆర్కు లేదు..
- కేటీఆర్, హరీష్ సవాలు విసిరితే చర్చకు రావడానికి నేను సిద్ధం: జగ్గారెడ్డి
విశ్వంభర, హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తమ సుదీర్ఘ రాజకీయ అనుభవం ముందు కేటీఆర్ ఒక జీరో అని, ఆయన ఒక చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చర్చకు పిలిచే స్థాయి కేటీఆర్కు లేదని అన్నారు.మంగళవారం గాంధీ భవన్లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రశ్నించారు. మేమంతా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి క్షేత్రస్థాయి నుంచి నాయకులుగా ఎదిగాం. కేటీఆర్ తన తండ్రి సీటిస్తే నేరుగా ఎమ్మెల్యే అయ్యారు. ఆయనెప్పుడైనా సర్పంచ్గా గెలిచారా? జడ్పీటీసీగా గెలిచారా? రాజకీయాల్లోని కష్టనష్టాలు, ఒడిదుడుకులు ఆయనకు ఎలా తెలుస్తాయి?" అని జగ్గారెడ్డి నిలదీశారు.అమెరికా లో చదువుకొని వచ్చిన నీకు ఎమ్మెల్యే లు అసెంబ్లీ లో చర్చ చేస్తారా,రోడ్ల మీద చేస్తారా అన్న జ్ఞానం కూడా లేదా అని ప్రశ్నించారు.
మీ నాయన కేసీఆర్ చర్చ కు సవాలు చేస్తే, సీఎం రేవంత్ రెడ్డి వస్తారు, అవసరం అయితే నేను సీఎం ను ఒప్పించేందుకు ట్రై చేస్తానన్నారు. లేదంటే కేటీఆర్, హరీష్ లు సవాలు చేస్తే నేను రావడానికి ఎక్కడికైనా మీతో చర్చించేందుకు సిద్ధం అన్నారు. కేటీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారని, కాంగ్రెస్ నేతలను "గాడిదలు" అంటూ విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. "మీరు మమ్మల్ని ఒక మాట అంటే మేము పది మాటలు అంటాం. మీరు ముఖ్యమంత్రిని దూషించడం ఆపేస్తే, మేము కూడా ప్రతి విమర్శలు ఆపేస్తాం" అని స్పష్టం చేశారు.
18 నెలలు అధికారం లేకపోయేసరికి కేటీఆర్ గట్టున పడ్డ చేపలా కొట్టుకుంటున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. సోదరి కవిత అరెస్టు వ్యవహారంతో ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, అందుకే తరచూ విదేశీ పర్యటనలకు వెళుతున్నారని ఆరోపించారు. అందరికీ వడదెబ్బ తగిలితే కేటీఆర్ కి సిస్టర్, బ్రదరిన్ల స్ట్రోక్ తగిలిందని అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు.కాంగ్రెస్ను విమర్శించే ముందు కేటీఆర్ బాగా అధ్యయనం చేయాలని జగ్గారెడ్డి సూచించారు.సీఎం రేవంత్ రెడ్డి ని గోకుడు ఎందుకు మళ్ళీ ఆయనతో తన్నించుకోవడం ఎందుకని అన్నారు.



