ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

విశ్వంభర, నిజామాబాద్: ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువు, క్రీడలు, ఇతర అంశాలపై చక్కగా దృష్టి సారించవచ్చని హితవు పలికారు. మాక్లూర్ మండలం  దాస్ నగర్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం సందర్శించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్​  సూచించారు. చెత్తాచెదారం, ఇతర వ్యర్థాలను రోజువారీగా తరలించేందుకు వీలుగా స్వచ్ఛ ఆటోను పాఠశాలకు పంపాలని సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. గురుకులంలోని కిచెన్​ను, విద్యార్థినుల కోసం వండిన ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. నాణ్యమైన సరుకులు, తాజా కూరగాయలు వినియోగించాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వైద్యారోగ్య శాఖ  ఆధ్వర్యంలో పాఠశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. వివిధ విభాగాల వారీగా విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ, చక్కటి ఆరోగ్యం కోసం ఆకుకూరలు, తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా, వెంటనే నిర్వాహకుల దృష్టికి తీసుకురావాలని, అశ్రద్ధ చేయకూడదని అన్నారు. సరైన ఆహార నియమాలను పాటిస్తూ, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలని, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని కలెక్టర్​ విద్యార్థినులకు మార్గనిర్దేశం చేశారు. ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా, వార్షిక పరీక్షలను ఆత్మవిశ్వాసంతో చక్కగా రాయాలని సూచించారు. బాలికల భద్రత, రక్షణ, ఆరోగ్యాల పరిరక్షణ విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని, బయటి వ్యక్తులు ఎవరూ పాఠశాల లోనికి రాకుండా గట్టి పర్యవేక్షణ చేయాలని పాఠశాల నిర్వాహకులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి రాజశ్రీ, డిప్యూటీ డీఎంహెచ్​వో శ్వేత, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ స్వప్న, వైద్యులు సందీప్, శశిధర్, అర్వింద్​ తదితరులు ఉన్నారు.

Tags: