నిజాం హంతకుడే: ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు..!!
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజకీయంగా వాతావరణం వేడెక్కింది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజకీయంగా వాతావరణం వేడెక్కింది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడికీ బీజేపీ సభ్యత్వం ఉందని చెబితే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అనుమానం ఉంటే వెళ్లి చూసుకోండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. నిజామాబాద్ నగరాన్ని ఇకపై ఇందూర్ గా పిలవాలని అర్వింద్ డిమాండ్ చేశారు. నిజాం ఒక హంతకుడని, అలాంటి వ్యక్తి పేరుతో నగరాన్ని కొనసాగించడం సరికాదని అన్నారు. ఇందూర్ అనే పేరు ఎలా ఏర్పడిందన్న విషయంపై చారిత్రక ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. నిజామాబాద్ పేరును మార్చి ఇందూర్గా చేయాలంటూ తీర్మానం చేసి, ఏబీవీపీ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపిస్తామని తెలిపారు. మత రాజకీయాలపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముస్లింలంటే కాంగ్రెస్ అన్నట్లుగా మాట్లాడటం సరికాదని విమర్శించారు. పహల్గాం ఘటనను ప్రస్తావిస్తూ, అక్కడ హిందువులా ముస్లింలా అని గుర్తించి కాల్చిచంపిన ఉదంతాన్ని గుర్తు చేశారు. సమాజంలో కొంతమంది హిందువుల్లోనూ చెడు ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ త్వరలోనే కాషాయమయం కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ బలం ఎక్కడుందో తెలుసుకోవాలంటే కవితను అడిగితే చెబుతుందని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో సిరిసిల్లలో కూడా పార్టీ శక్తిని చూపిస్తామని చెప్పారు. ఇందూర్కు దమ్ముంటే రా అంటూ కేటీఆర్కు సవాల్ విసిరారు. గతంలో కాంగ్రెస్ పాలనలోనే మత ఘర్షణలు చోటు చేసుకున్నాయని అర్వింద్ ఆరోపించారు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే వరకు రాష్ట్రంలో అల్లర్లు కొనసాగాయని పేర్కొన్నారు. ఏసీపీ సత్తయ్య హత్య కేసులో నిందితులను బయటకు తీసుకొచ్చింది మజ్లిస్ పార్టీనేనని ఆరోపించారు. తిన్న తిండి అరగక హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, దీనికి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదేనని విమర్శలు గుప్పించారు.
నిజాంను గాడిద అన్నందుకే పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని, కానీ చరిత్రలో నిజాం ఎప్పటికీ క్రూర పాలకుడిగానే మిగిలిపోతాడని అర్వింద్ వ్యాఖ్యానించారు. ఆయన పేరు వినగానే హిందువులకు గుర్తొచ్చేది ఆయన చేసిన మారణకాండేనని అన్నారు. అదే సమయంలో ముస్లింల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇళ్లు, రేషన్, ఉచిత వ్యాక్సినేషన్ అందించడంతో పాటు, ముస్లిం దేశాలకు కూడా టీకాలు పంపించిందని పేర్కొన్నారు.



