పొట్టి శ్రీరాములు భారీ విగ్రహావిష్కరణ
విశ్వంభర, అమరావతి: పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అమరావతి శాఖమూరులో సీఎం చంద్రబాబు నాయుడు అమరజీవి భారీ విగ్రహాన్నీ ఆవిష్కరించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సహా వివిధ మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అమరజీవి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తదితరులు నివాళులర్పించారు. అమరావతిలో ఏర్పాటు చేసిన తొలి భారీ విగ్రహం ఇది. పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేసారు. శాఖమూరు పార్కులోని 6.80 ఎకరాల్లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. దీనికి అమరజీవి-త్యాగ శిల్పం (స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్) అని పేరు పెట్టారు. 6 నెలల రికార్డు కాలంలోనే ప్రాజెక్ట్ మొదటి దశ పనులు పూర్తి చేసారు. పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం కోసం 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్ వినియోగించారు. రెండో దశలో మ్యూజియం, ఆడిటోరియం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల నిర్మాణం చేపట్టనున్నారు.



