BREAKING: కూకట్పల్లిలో హైటెన్షన్.. లులు మాల్ కోసం దుకాణాల కూల్చివేత..!
లులు మాల్ కోసం రోడ్డుపక్కన దుకాణాలను జేసీబీలతో కూల్చివేస్తున్నారు అధికారులు. దీంతో ఏళ్లు అక్కడే ఉంటున్న ఎంతో మంది పేదలు ఆందోళనకు దిగారు. రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సమక్షంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ కూకట్పల్లిలో హైటెన్షన్ నెలకొంది. లులు మాల్ కోసం దుకాణాలను జేసీబీలతో కూల్చివేస్తున్నారు అధికారులు. దీంతో ఏళ్లు అక్కడే ఉంటున్న సుమారు 100మంది స్థానికులు ఆందోళనకు దిగారు. లులుమాల్ వల్లే ట్రాఫిక్ సమస్య తలెత్తిందని ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సమక్షంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అధికారులు మాత్రం ప్రభుత్వ భూమిలో చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు చెబుతున్నారు.
జేఎన్టీయూ రైతుబజార్, కూకట్ పల్లి ఎమ్మార్వో ఆఫీస్ ప్రాంతాల్లో ఆక్రమణలను కూల్చివేస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ భూమిని ఎవరైనా కబ్జా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కూల్చివేతలపై స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా వ్యాపారాలు చేసుకుంటున్న వారిపై ఇలా ప్రవర్తిస్తారా? అంటూ మండిపడ్డారు.
కనీసం సమాచారం ఇవ్వకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఎలా కూలుస్తారని ప్రశ్నించారు. లులు మాల్ కోసం ఇంతమందిని రోడ్డున పడేస్తారా? అంటూ ధ్వజమెత్తారు. కూల్చివేతలకు కారణమైన వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. సమస్య పరిష్కారమయ్యేవరకు బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.