25 ఏళ్ల చదువు… 75 ఏళ్ల గౌరవ జీవితం: సీఎం రేవంత్ రెడ్డి
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: 25 సంవత్సరాలు క్రమశిక్షణతో చదువుపై దృష్టి పెట్టితే, జీవితాంతం గౌరవంగా జీవించే అవకాశం కలుగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: 25 సంవత్సరాలు క్రమశిక్షణతో చదువుపై దృష్టి పెట్టితే, జీవితాంతం గౌరవంగా జీవించే అవకాశం కలుగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఏర్పాటు కానున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్తో పాటు చిట్టబోయినపల్లిలో నిర్మించనున్న ట్రిపుల్ ఐటీకి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు మరియు విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
అదే దిశగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సాగునీటి వసతులు, విద్యాభివృద్ధినే ప్రధాన లక్ష్యాలుగా ముందుకు సాగుతోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో గతంలో నిర్మించిన అనేక సాగునీటి ప్రాజెక్టులే ఇప్పటికీ రైతులకు, గ్రామీణ ప్రజలకు ఆధారంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. భూసీలింగ్ చట్టం ద్వారా అప్పట్లో పెద్ద పెద్ద భూస్వాముల వద్ద ఉన్న విస్తారమైన భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయడం ద్వారా సామాజిక న్యాయానికి కాంగ్రెస్ బాటలు వేసిందని వివరించారు.
విద్య ద్వారానే వ్యక్తికి సమాజంలో గౌరవం లభిస్తుందని, కేవలం చదివినంత మాత్రాన కాదు, నిబద్ధతతో కూడిన విద్యే జీవితాన్ని మార్చగలదని ముఖ్యమంత్రి సూచించారు. లక్ష్యంతో, క్రమశిక్షణతో చదివితేనే వ్యక్తిగతంగా ఎదగడంతో పాటు సమాజానికీ ఉపయోగపడతారని ఆయన అన్నారు.



