ఘోర బస్సుప్రమాదం.. 18 మంది దుర్మరణం
విశ్వంభర, నేషనల్ బ్యూరో: నేపాల్లోని ధాడింగ్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఒక ప్రయాణికుల బస్సు నదిలోకి దూసుకెళ్లిన ఘటనలో కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం పృథ్వీ హైవేపై బెనిఘాట్ రోరాంగ్ రూరల్ మున్సిపాలిటీ-5 పరిధిలోని భైన్సిగౌడ వద్ద చోటుచేసుకుంది. పోఖారా నుంచి ఖాట్మండుకు వెళ్తున్న ఈ బస్సు సోమవారం తెల్లవారుజామున సుమారు 1:30 గంటల సమయంలో నియంత్రణ కోల్పోయి త్రిశూలి నదిలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత లేకపోవడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటివరకు ఘటనా స్థలం నుండి 17 మృతదేహాలను వెలికితీశారు. మరో 24 మంది ప్రయాణికులను గాయాలతో సురక్షితంగా రక్షించి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. సాయుధ పోలీసు దళం (APF) నేపాల్ విపత్తు నిర్వహణ విభాగం నుండి శిక్షణ పొందిన డైవర్ల బృందాన్ని సహాయక చర్యల కోసం రంగంలోకి దించారు. నది ప్రవాహంలో ఇంకా ఎవరైనా కొట్టుకుపోయి ఉంటారనే అనుమానంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల వివరాలను సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, అతివేగం లేదా సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.



