మమ్మల్ని తిట్టించే బదులు చంపేయండి: ముద్రగడ
- పవన్ చేతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
- కాపులకు రిజర్వేషన్ సాధించాలి
- కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి డిమాండ్
- పవన్ అభిమానులు దుర్భాషలాడుతున్నారంటూ ఆరోపణ
ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరును మార్చుకుంటానని చెప్పి మాట నిలబెట్టుకున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పవన్, జనసేన అభిమానులు దుర్భాషలాడుతూ ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మమ్మల్ని తిట్టించే బదులు మా కుటుంబంలో ఏడుగురం ఉన్నాం.. అందరినీ చంపేయండి..’’ అని అన్నారు.
‘‘మేము అనాథలం ఎవరు అడ్డుకోరు.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు వదిలేశారు.. పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు వదిలేసి ప్రజాసేవ చేయాలి.. నేను ఒత్తిడి చేసి నా పేరు త్వరగా మార్చమని కోరాను.. నా సవాల్కు కట్టుబడి నా పేరు మార్చుకున్నా. పౌర్ణమి తర్వాత అమావాస్య కూడా వస్తుంది అది గుర్తు పెట్టుకోవాలి. వైసీపీ సానుభూతిపరుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. వెంటనే వారిని ఆపాలి. నేను చేతకాని వాడిని. అసమర్థుడిని కాబట్టి పవన్ కళ్యాణ్ను ఉద్యమం చేయాలని కోరాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పవన్ కల్యాణ్ చేతుల్లో ఉన్నందున. ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలి’’ అంటూ ముద్రగడ పద్మనాభరెడ్డి పిలుపునిచ్చారు.