రేవంత్రెడ్డి అహంకారానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు
- - ఒర్రుడు, అబద్దాలు మాని పరిపాలనపై దృష్టి పెట్టాలే
- కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్దరణ బాధ్యత దుద్దిళ్ల తీసుకోవాలే
- మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
విశ్వంభర, మంథని: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అహంకారానికి హైకోర్టు తీర్పు పరాకాష్టగా నిలుస్తుందని, ఇప్పటికైనా రేవంత్రెడ్డి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ కళ్లు తెరువాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. మంథని పట్టణంలోని రాజగృహాలో హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హైకోర్టు తీర్పు తర్వాత పీసీ ఘోష్ కమీషన్ రిపోర్ట్ పీసీసీ స్ట్రిఫ్గా నిర్థారించబడిందని అన్నారు. రేవంత్రెడ్డి గొంతుపెద్దగా ఉందని ఒర్రుడు బంద్ చేసి అబద్దాలు ఆడుడు మానేసి పరిపాలనపై దృష్టి పెట్లాలని ఆయన డిమాండ్ చేశారు. గత మూడేళ్లుగా అడ్డూఅదుపు లేకుండా ఓర్రిన సీఎం రేవంత్రెడ్డి హైకోర్టు తీర్పుతోనైనా కళ్లు తెరువాలని ఆయన అడుగులకు మడుగులు ఒత్తే మంథని ఎమ్మెల్యే కళ్లు తెరుస్తాడని బావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఏదైనా ప్రాంతానికి ప్రాజెక్టు వస్తే ఆహ్వనించాల్సిన ఆ ప్రాంత ప్రతినిధి కాళేశ్వర ప్రాజెక్టును వ్యతిరేకించడం దుర్మార్గం దౌర్భాగ్యమన్నారు. దాంట్లో ముందు వరుసలో దుద్దిళ్ల శ్రీధర్ నిలబడటం ఆశ్చర్యకరమన్నారు. 150 కిలోమీటర్ల విస్తీర్ణంలో నియోజకవర్గంలోనే నీళ్లు నిలబడి ఉంటున్న ఇంత పెద్ద ప్రాజెక్టుతో పశ్చమ తూర్పు గోదావరిని తలపించే విధంగా ఈ ప్రాంతం మారుతున్న క్రమంలో ఇద్దరు ఐరల్ లెగ్లు రేవంత్రెడ్డి, శ్రీధర్లు అధికారంలోకి వచ్చి కళ్లలో కారం పోసుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఆనాడు తమ్మడిశెట్టి వద్ద ప్రాజెక్టు కడితే బాగుంటదని మాట్లాడిన నాయకులు మూడేళ్లయినా ప్రతిపాదన చేయలేదని తట్టెడు మట్టి తీయలేదన్నారు. తమ్మిడిశెట్టి నుంచి మేడిగడ్డకు కేసీఆర్ ఒకరి ఆలోచన కాదని, క్యాబినెట్ నిర్ణయంతో పాటు ఇంజనీరింగ్ నిపుణుల కమిటి లోతైన అధ్యయనం చేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే కేసీఆర్ ప్రభుత్వం మేడిగడ్డ వద్ద బ్యారేజీ మొదలు పెట్టిందని హైకోర్టు తేల్చి చెప్పిందని, ఈ విషయంలో ఇకనైనా అజ్ఞానులకు జ్ఞానం రావాలని ఆయన కోరుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న దుష్ప్రచారంపై హైకోర్టు కుడా మందలించిందని, కేసీఆర్ అనుమతి లేకుండా ఆయనను అబాసుపాలు చేసేలా దుష్ప్రచారం చేయడం చట్ట విరుద్దమని, కేసీఆర్, హరీష్రావుతో పాటు ఆనాడు పని చేసిన అధికారులను బదనాం చేయడం కూడా చట్ట విరుద్దమని హైకోర్టు చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు.హైకోర్టు తేల్చి చెప్పినా సీఎం రేవంత్రెడ్డి కళ్లు తెరువడని, అందుకే రేవంత్రెడ్డి బ్యాచ్ను దండుపాళం బ్యాచ్ అని కేటీఆర్ అన్నడన్నారు. కాళేశ్వరం పూర్తిగా కొట్టుకుపోయిందని బదనాం చేసినోళ్లు ఈనాడు మేడిగడ్డకు కాన్వాయ్తో బ్యారేజ్మీద నుంచి పోయి పగుళ్లను చూసి వచ్చి మళ్లీ సభలో మేడిగడ్డ కూలిపోయిందని అనడం హస్యాస్పదన్నారు. రేవంత్రెడ్డి కళ్లున్న కబోదిలా మాట్లాడుతున్నాడని అన్నారు. మూడు సార్లు బారీ వర్షాలు, లక్ష క్యూసెక్కుల వరద నీటి తట్టుకుని నిలబడ్డదని, కుంగిపోయింది కానీ ఇంత పెద్ద వరదలు వచ్చినా ఇంచు కదలలేదని ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బదనాం చేసిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నుంచి కేసీఆర్ వరకు దుష్పచారం చేసి అదికారంలోకి వచ్చిండ్లని ఆయన అన్నారు. అయితే ఈసారి వర్షాలు తక్కువగా ఉంటయని నీళ్లకు ఇబ్బంది ఏర్పడుతుందని వాతావరణశాఖ హెచ్చరించినా కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఆపడం లేదని, ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్దరించి రైతులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంత పెద్ద సమాజం ఓట్లు వేసి గెలిపిస్తే మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ ఈ ప్రాంత ప్రజలు, రైతుల గురించి కనీసం ఆలోచన చేయడం లేదని, వ్యవసాయం, రైతులు అంటే ఆయనకు తెలియదని ఎద్దేవా చేశారు. అనేక ఏండ్లుగా మానేరు, గోదావరినది ద్వారా నీళ్లు వృథాగా పోతున్నా ఈ ప్రాంత ఎమ్మెల్యేగా పరివాహక ప్రాంతాలకు నీళ్లు అందించాలని ఏనాడు ఆలోచన చేయలేదని విమర్శించారు. హైకోర్టు తీర్పుతోనైనా రేవంత్రెడ్డి, ఆయన క్యాబినెట్ కళ్లు తెరువాలని, కాళేశ్వరం ప్రాజెక్టు అందరికి శ్రీరామ రక్ష అని గ్రహించి ప్రాజెక్టు పునరుద్దరణకు మంథని ఎమ్మెల్యే పూర్తి బాధ్యత తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు



