ప్రియురాలికి నిప్పుపెట్టి ప్రియుడి ఆత్మహత్యాయత్నం
సహజీవనంలో నెలకొన్న అనుమానం ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు, అనంతరం తాను కూడా నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘోర ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ ప్రాంతంలో గురువారం చోటుచేసుకుంది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: సహజీవనంలో నెలకొన్న అనుమానం ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు, అనంతరం తాను కూడా నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘోర ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ ప్రాంతంలో గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. ప్రగతి నగర్కు చెందిన అంజయ్య భార్య రెండేళ్ల క్రితం మరణించింది. ఆ తర్వాత పద్మ అనే మహిళతో అతనికి పరిచయం ఏర్పడి, అది కాస్తా సహజీవనానికి దారితీసింది. అయితే, పద్మ మరొకరితో సన్నిహితంగా ఉంటోందనే అనుమానంతో అంజయ్య తీవ్ర అసహనానికి లోనయ్యాడు.
ఘోరానికి ఒడిగట్టిన ప్రియుడు
గురువారం పద్మ తన తల్లి ఇంటికి వచ్చినట్లు తెలుసుకున్న అంజయ్య, పెట్రోల్ బాటిల్తో అక్కడికి వెళ్లాడు. “తనకు దక్కనిది వేరొకరికి దక్కకూడదు” అనే ఆవేశంతో పద్మపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ వెంటనే తానూ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ, ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ స్థానికులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల వివరాల ప్రకారం వారి పరిస్థితి విషమంగా ఉంది. పద్మకు భర్త, ఇద్దరు పిల్లలు ఉండగా, అంజయ్యకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనతో రెండు కుటుంబాలు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.



