ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా "వేదవ్యాస్" ఎనౌన్స్
నిర్మాత కె.అచ్చిరెడ్డి బర్త్ డే పురస్కరించుకుని "వేదవ్యాస్" హీరో పిడుగు విశ్వనాథ్ ను పరిచయం చేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో ఎన్నో ఘన విజయాలను అందించిన దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా "వేదవ్యాస్". ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి సమర్పణలో సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త, పొలిటీషియన్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. బుధవారం నిర్మాత కె.అచ్చిరెడ్డి బర్త్ డే పురస్కరించుకుని "వేదవ్యాస్" హీరో పిడుగు విశ్వనాథ్ ను పరిచయం చేశారు.
ఈ సందర్భంగా నటుడు సాయికుమార్ మాట్లాడుతూ అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి సినిమాలో నేను నటించడం ఇదే తొలిసారి. చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా మనకు పరిచయం ఉన్న పిడుగు సుబ్బారావు గారి కొడుకు పిడుగు విశ్వనాథ్ హీరోగా మన ముందుకు వస్తున్నారు. ఆయన హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్న అన్నారు. పిడుగు సుబ్బారావు మాట్లాడుతూ ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి గారి గొప్ప కాంబినేషన్ మూవీతో మా అబ్బాయి విశ్వనాథ్ హీరోగా పరిచయం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. హీరో పిడుగు విశ్వనాథ్ మాట్లాడుతూ "వేదవ్యాస్" సినిమాలో హీరోగా నటించే అవకాశం కల్పించిన అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు. వారి సినిమాతో హీరోగా పరిచయం కావడం నా అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.
ప్రొడ్యూసర్ కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ - మా ఎస్వీ కృష్ణారెడ్డి ఐదారేళ్లుగా ఈ మూవీ మీద ఆయన వర్క్ చేస్తూ వచ్చారు. ఈ సినిమా కోసం కొరియా వెళ్లి ఆడిషన్ చేసి కొరియన్ అమ్మాయి జున్ హ్యున్ జీ ని సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే మంగోలియా వెళ్లి విలన్ ను సెలెక్ట్ చేశారు. ఒక కొత్త హీరో అయితేనే బాగుంటుందని విశ్వనాథ్ ను తీసుకున్నారు. మూవీలో వీళ్లందరినీ చూశాక కృష్ణారెడ్డి గారి జడ్జిమెంట్ ఎంత కరెక్ట్ అనేది అర్థమైందని అన్నారు. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ విశ్వనాథ్ ను హీరోగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఆయన ప్రతి సన్నివేశంలో అద్భుతంగా నటించారు. మంచి ఫైట్స్ చేశారు. నేను షూటింగ్ చేశా కాబట్టి ఈ విషయం చెబుతున్నా. విశ్వనాథ్ హీరోగా మంచి పేరు తెచ్చుకుంటాడని అన్నారు.



