పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్’ డబ్బింగ్ షురూ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి సంబంధించి మేజర్ అప్డేట్ వచ్చేసింది.
విశ్వంభర, సినిమా బ్యూరో: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి సంబంధించి మేజర్ అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచింది. తాజాగా చిత్ర బృందం పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ పనులను ప్రారంభించింది. దర్శకుడు హరీశ్ శంకర్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు పాల్గొన్న ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో పవన్కల్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న ట్యూన్స్ ఇప్పటికే ఫ్యాన్స్ను ఉర్రూతలూగిస్తున్నాయి.
మార్చి 26న విడుదల?
ఈ సినిమా విడుదల తేదీపై ఫిల్మ్ నగర్లో ఒక ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. తొలుత మార్చి 27న రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల కావాల్సి ఉంది. అయితే ఆ సినిమా వాయిదా పడే సూచనలు ఉండటంతో, అదే స్లాట్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘ధురంధర్ 2’, ‘టాక్సిక్’, ‘ప్యారడైజ్’ వంటి భారీ చిత్రాల మధ్య ఈ సినిమా వస్తుందా లేదా అన్న సందిగ్ధతకు ‘పెద్ది’ వాయిదాతో తెరపడింది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
హరీశ్ శంకర్ క్రేజీ పోస్ట్
చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్ తన తాజా ఎక్స్ పోస్ట్తో అభిమానుల్లో జోష్ నింపారు. "సంక్రాంతి బ్లాక్బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడికి మెగాస్టార్ చిరంజీవి కారు గిఫ్ట్ ఇచ్చారు. ఆ కారు వేసుకొని వస్తే.. అందులో ఉస్తాద్లోని 'కొత్త సాంగ్' ప్లే చేసుకుంటూ డ్రైవ్కు వెళ్దాం, అదే నా గిఫ్ట్" అంటూ సరదాగా ట్వీట్ చేశారు. దీన్నిబట్టి రెండో పాట విడుదలకు సిద్ధంగా ఉందని స్పష్టమవుతోంది.



