చెంగిచెర్లలో చోరీకి పాల్పడిన దొంగల ముఠా అరెస్ట్
- విలేకరుల సమావేశంలో డిసిపి సురేష్ కుమార్
విశ్వంభర, మేడిపల్లి : మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్లలో పలు ఇళ్లలో సంక్రాంతి సమయంలో దొంగతనం చేసిన విషయం తెలిసిందే. పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎట్టకేలకు అంతర్రాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకొకొన్నారు. శుక్రవారం మేడిపల్లి పోలీస్ స్టేషన్లో డిసిపి సురేష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు డిసిపి సురేష్ కుమార్ మాట్లాడుతూ, ఢిల్లీకి చెందిన మహాదేవ్ ఝా ఏ1, పవన్ గుప్తా ఏ2, కాన్పూర్కు చెందిన మంగళ్ సింగ్ ఏ3 లు బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని 9 ఇళ్లలో చోరీలకు పాల్పడి 250 గ్రాముల బంగారం, 6 కిలోల వెండి, రూ.2 లక్షల నగదును దోచుకొని పరారయ్యారు. పోలీసులు సాంకేతిక ఆధారాలు,సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వరుస నేరాలకు పాల్పడుతున్న నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరితో పాటు దొంగ సొత్తు కొనుగోలు చేసిన బీహార్కు చెందిన సీరామ్ సవ్ బీరేంద్ర ఏ 4 ను కూడా ట్రాన్సిట్ వారెంట్పై మేడిపల్లి తీసుకువచ్చి ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించారు. మరో ఇద్దరు నిందితులను బీహార్ నుంచి మేడిపల్లికి తీసుకువస్తున్నట్లు తెలిపారు. నిందితులు గతంలో నల్గొండ, వరంగల్, జనగాం పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా పలు చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు చెప్పారు. వారి నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, రూ.2,04,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీస్ సిబ్బందిని డీసీపీ సురేష్ కుమార్ అభినందించి రివార్డులు అందించారు.



